ప్రగతి భవన్‌కు రండి

12 May, 2020 03:27 IST|Sakshi

ఆపిల్‌ రైతుకు కేసీఆర్‌ నుంచి పిలుపు

తెలంగాణ ఆపిల్‌ రుచి చూడాలని నిర్ణయం

త్వరలో హైదరాబాద్‌ వెళ్లనున్న బాలాజీ 

కెరమెరి (ఆసిఫాబాద్‌): ఏళ్ల తరబడి పడిన శ్రమకు ఎట్టకేలకు గుర్తింపు లభించింది. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ఆపిల్‌ రుచిని చూసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామంలో ఆపిల్‌ సాగు చేస్తున్న కేంద్రె బాలాజీకి ముఖ్యమంత్రి నుంచి ఆహ్వానం అందింది. ప్రగతి భవన్‌కు వచ్చి తనను కలవాలని కోరారు. ఈ నెల 5న ‘ఇదిగో తెలంగాణ ఆపిల్‌’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం ప్రగతి భవన్‌లో ఉద్యానశాఖ అధికారులతో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆపిల్‌ సాగు విషయం చర్చకు వచ్చింది. దీంతో ఆపిల్‌ సాగు చేస్తున్న రైతును ఆహ్వానించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దీంతో సోమవారం ఉదయం ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్‌ వెంకట్‌రాంరెడ్డి నుంచి బాలాజీకి ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘ఆపిల్‌ పంట సాగు గురించి సీఎంకు వివరించాం.. మిమ్మల్ని హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు వచ్చి కలవమన్నారు’అని చెప్పారు. కాగా, ఈ నెలాఖరులో సీఎంను కలసి ఆపిల్‌ రుచి చూపిస్తానని బాలాజీ అంటున్నారు. ఆపిల్‌ పండ్లను చూపుతున్న రైతు బాలాజీ

మరిన్ని వార్తలు