-

కొనసాగుతున్న వడపోత

13 Mar, 2019 03:40 IST|Sakshi

ఎంపీ అభ్యర్థులపైసీఎం కేసీఆర్‌ కసరత్తు 

సామాజిక వర్గాల వారీగా లెక్కలు 

16 లోపు అభ్యర్థుల ప్రకటన

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ లోక్‌సభ స్థానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. కేసీఆర్‌ ఈ నెల 17న లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఆలోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు. సిట్టింగ్‌ ఎంపీలలో పలువురికి ఈసారి అవకాశం ఇవ్వబోమని కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించారు. టికెట్లు దక్కని సిట్టింగ్‌లు ఎందరు ఉంటారనేది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్‌లను మార్చితే తమకు అవకాశం ఇవ్వాలని పలువురు నేతలు టీఆర్‌ఎస్‌ అధిష్టానాన్ని కోరుతున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలసి తమ పేర్లను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 
వీరికి మళ్లీ అవకాశం.. 
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, భువనగిరి, వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లకే అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ నిర్ణయించా రు. మిగిలిన సీట్ల విషయంలో సమీకరణ ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. పెద్దపల్లిలో మాజీ ఎంపీ జి.వివేకానంద పేరు దాదాపు ఖాయమైంది. అయితే పెద్దపల్లి లోక్‌సభ సెగ్మెంట్‌కు చెందిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యలు వివేకానంద అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వివేక్‌ వ్యతిరేకంగా పని చేశారని టీఆర్‌ఎస్‌ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వివేక్‌తో పాటు మరికొందరు పేర్లను కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్‌ సెగ్మెంట్లలో సిట్టింగ్‌లకు కాకుండా కొత్త వారికి చాన్స్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం భావిస్తోంది. సమీకరణల ఆధారంగా చివరి నిమిషం వరకు పలువురి పేర్లను పరిశీలిస్తోంది. టీఆర్‌ఎస్‌ ఇప్పటి వరకు గెలవలేకపోయిన మల్కాజిగిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, నాగర్‌కర్నూలు లోక్‌సభ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది.

మరిన్ని వార్తలు