కరోనా తగ్గుముఖం పడుతుంది

23 Apr, 2020 02:42 IST|Sakshi

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశాభావం 

రాబోయే రోజుల్లో మరింతగా తగ్గనున్న కేసులు 

కాంటాక్టులను గుర్తించి క్వారంటైన్‌ 

తగ్గుముఖం పడుతోందని సీఎంకు అధికారుల నివేదిక 

సాక్షి, హైదరాబాద్‌: కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ వల్ల, కరోనా వైరస్‌ సోకిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తు న్న కారణంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత తగ్గే అవకాశంఉందని పేర్కొన్నారు. కరోనా వైరస్, లాక్‌డౌన్‌ అంశాలపై సీఎం కేసీఆర్‌ బుధవారం రాత్రి 11.30 గంటల వరకు ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ముఖ్యకార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతకుమారి, వైద్యాధికారులు సమీక్షలో పాల్గొన్నారు.

కాగా, కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో పరిశీలించడానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. అనంతరం వారు నేరుగా ప్రగతిభవన్‌చేరుకుని సీఎంకుఅక్కడి పరిస్థితి వివరించారు. ఈ సందర్భంగా సీఎంకేసీఆర్‌.. హైదరాబాద్‌ సహా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించారు. గాంధీఆస్పత్రిలో అందుతున్న చికిత్సవివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అన్ని ప్రాంతాల్లో తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని వైద్యాధికారులు చెప్పారు. చదవండి: 12 లక్షణాల కరోనా!

విజయవంతంగా లాక్‌డౌన్‌ అమలు.. 
‘రాష్ట్రంలో కరోనా సోకిన వారందరినీ గుర్తించాం. వారి ద్వారా ఎవరెవరికి వైరస్‌ సోకే అవకాశం ఉందో జాబితా తయారు చేసి పరీక్షలు జరిపాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో కరోనా వైరస్‌ సోకిన వారున్నారో ఒక అంచనా దొరికింది. దీని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్లు ఏర్పాటు చేశాం. అక్కడ ప్రజలను బయటకు రానీయకుండా, బయటి వారిని అక్కడికి వెళ్లకుండా కఠినంగా వ్యవహరించాం.

కాంటాక్టు వ్యక్తులందరినీ క్వారంటైన్‌ చేశాం. దీని కారణంగా వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అరికట్టగలిగాం. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇలాగే సహకరించి లాక్‌డౌన్‌ నిబంధనలను, కంటైన్మెంట్‌ నిబంధనలు పాటిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది’అని సీఎంపేర్కొన్నారు. చదవండి: ముంబైలో మనోళ్లు బిక్కుబిక్కు.. 

మరిన్ని వార్తలు