పోలవరం ముంపు ప్రాంతాలపై ఆర్డినెన్స్ అసంబద్ధం

28 May, 2014 01:08 IST|Sakshi
ఢిల్లీలో విలేకరులో మాట్లాడుతున్న కేసీఆర్

* ఢిల్లీలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
* ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపొద్దు
* మోడీ సన్నిహితులతో మాట్లాడి ఆర్డినెన్స్ వద్దని చెప్పా
* హడావుడిగా తెస్తే ప్రధాని తన ముఖానికి మసి పూసుకున్నట్లే
* ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించాలి
* పోలవరానికి  వ్యతిరేకం కాదు, ఎత్తు తగ్గించాలని కోరుతున్నాం
* వార్‌రూమ్‌కు చంద్రబాబు వస్తే స్వాగతిస్తామని వెల్లడి
 
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ముంపు ప్రాంతాలను విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కలిపేందుకు కేంద్రం ఆర్డినెన్స్ తేవడానికి ప్రయత్నిస్తోందని, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాబోయే తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కే సీఆర్ తెలిపారు. రాజ్యాంగ విరుద్ధంగా ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలు చేయడం అసంబద్ధమని, అవసరమైతే దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు మూడు రోజుల కిందట ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ తిరిగి హైదరాబాద్ పయనమయ్యే ముందు మంగళవారం ఇక్కడి తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.

‘పార్లమెంట్‌లో ఆమోదం పొందిన బిల్లుకు విరుద్ధంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. నాలుగు రోజుల్లో పార్లమెంట్ సమావేశం కానున్న సమయంలో కొంపలంటుకున్న చందంగా కేబినెట్ తొలి భేటీలోనే ఆర్డినెన్స్‌ను తేవడమంటే అది ప్రధాని తన ముఖానికి మసి పూసుకున్నట్లే అవుతుంది. ప్రధాని దీన్ని పట్టించుకోకుంటే అప్రజాస్వామికంగా వ్యవహరించినట్లవుతుంది. తెలంగాణకు ఏమాత్రం మింగుడుపడని ఈ నిర్ణయాన్ని మోడీ ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడాకే నిర్ణయాలు తీసుకోవాలి. ఎవరో కోరారని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. దీన్ని వ్యతిరేకిస్తున్నా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.

దీనిపై ఇప్పటికే ప్రధానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులతో మాట్లాడానని, ఆర్డినెన్స్ తేవొద్దని కోరినట్లు చెప్పారు. ‘గత ప్రభుత్వ హయాంలోనే ఇలాంటి నోట్‌నే తీసుకొచ్చే ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదు. ఇప్పుడు మళ్లీ దాన్ని తెచ్చే ప్రయత్నం జరుగుతుందని తెలిసిన వెంటనే ప్రధానికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులతో ఫోన్‌లో మాట్లాడాను. ఇది ఎవరికీ మంచిది కాదని, ఈ నిర్ణయం మోడీ వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తుందని చెప్పా’ అని కేసీఆర్ తెలిపారు. 

‘రాష్ర్ట విభజన బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారింది. అపాయింటెడ్ డే మాత్రమే మిగిలి ఉంది. అది కూడా దానికదే జరిగిపోతుంది. ఇప్పుడు చట్టాన్ని మార్చాలంటే ఆర్టికల్ 3ని అనుసరించాలి తప్పితే ఆర్డినెన్స్ ద్వారా చేయలేరు. ఏ రాష్ట్ర సరిహద్దులు మార్చాలన్నా, ఒక రాష్ట్రంలోని ప్రాంతాలను ఇంకో రాష్ట్రంలో కలపాలన్నా రెండు ప్రభుత్వాల శాసనసభలను సంప్రదించాల్సి ఉంటుందని ఆర్టికల్ 3 చెబుతోంది. దీన్ని అనుసరించకుండా ఆదరాబాదరగా చేయడం మంచిది కాదని చెప్పాం. ప్రధాని మా మాటను మన్నిస్తారనే భావిస్తున్నా’అని వ్యాఖ్యానించారు. దీనిపై మోడీ సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నామని, అలా కాని పక్షంలో న్యాయ పోరాటం చేయడానికి ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడినట్లు కేసీఆర్ వెల్లడించారు. అయితే మంగళవారం కేంద్ర కేబినెట్ తొలి భేటీ జరిగినప్పటికీ అందులో పోలవరం అంశం చర్చకు రాకపోవడం గమనార్హం. బుధవారం కూడా కేబినెట్ మరోసారి భేటీ అవుతున్న నేపథ్యంలో కేసీఆర్  వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

పోలవరం ఎత్తును తగ్గించాల్సిందే..
ఇక పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, డ్యామ్ ఎత్తును తగ్గించి ముంపు ప్రాంతాన్ని తగ్గించాలని కోరుతున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు. ‘పోలవరం ప్రాజెక్టుకు మేం ఏమాత్రం వ్యతిరేకం కాదు. ప్రాజెక్టుతో 139 గ్రామ పంచాయతీలు ముంపునకు గురవుతున్నాయని నీటి పారుదల శాఖ 111 జీవో ద్వారా తెలిపింది. శబరీ నది ద్వారా వచ్చిన నీటిని ఆంధ్రానే వాడుకోవాలి. దానికి మేము అంగీకరిస్తాం. అయితే నిర్మాణ పద్ధతిపైనే వివాదం ఉంది. గిరిజన ప్రాంతాల ముంపు తక్కువగా ఉండేలా డ్యామ్ ఎత్తును తగ్గించాలి. దీనిపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్నాం’ అని టీఆర్‌ఎస్ అధినేత తెలిపారు.

భూకంపాలు రావడానికి అత్యంత ఆస్కారమున్న ప్రదేశాలను దేశంలో పదకొండింటిని గుర్తిస్తే.. అందులో పోలవరం డ్యామ్ కట్టే ప్రదేశం రెండో స్థానంలో ఉందని ఆంధ్రా ప్రాంత ఇంజనీర్లు కూడా చెప్పినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. ఈ దృష్ట్యానే డ్యామ్ ఎత్తును తగ్గించాలని కోరుతున్నామన్నారు. భద్రాచలం తెలంగాణలో ఉండి ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపితే తలాతోక లేకుండా తయారయ్యే పరిస్థితి ఉంటుందని, దీనిపై మాట్లాడటానికి కేబినెట్‌లో తెలంగాణ మంత్రులు లేరని ఆయన వ్యాఖ్యానించారు.
 
వార్‌రూమ్‌కు వస్తానంటే ఎవరొద్దన్నారు..
ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనపై టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన వార్‌రూమ్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టిన అంశాన్ని విలేకరులు ప్రస్తావించారు. దీనిపై కేసీఆర్ స్పందిస్తూ.. ‘వార్ రూమ్ అంటే యుద్ధ ప్రాతిపదికన పనులు చేయడం. అక్కడ నాలుగు కంప్యూటర్లు, నలుగురు మనుషులు కూర్చొని వివరాలు, ఫిర్యాదులు తీసుకుంటారు. దీన్ని వివాదం చేస్తానంటే బాబు ఖర్మ. ఆయన ఆలోచన లేకుండా మాట్లాడుతుండు. వార్ రూమ్‌కు నేనే వస్తానంటే.. ఎవరొద్దన్నారు. మేము స్వాగతిస్తున్నాం’ అని బదులిచ్చారు. కేంద్రం నుంచి కొత్త రాష్ట్రానికి నిధులు రాబట్టుకోవడంపై  మాట్లాడుతూ... తాము 11 మంది ఎంపీలం ఉన్నామని, రాష్ర్ట వాటా కోసం కొట్లాడి సాధించుకుంటామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు