కొండపోచమ్మ ఆలయంలో కేసీఆర్‌ దంపతుల ప్రత్యేక పూజలు

29 May, 2020 09:14 IST|Sakshi

సాక్షి, సిద్ధిపేట : కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామునే కొండపోచమ్మ సాగర్‌ పంపుహౌస్‌(మర్కూక్‌) వద్ద సుదర్శన యాగం, ప్రాజెక్టు నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని కొండపోచమ్మ దేవాలయంలో చండీయాగం ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల ప్రాంతంలో కొండపోచమ్మ ఆలయానికి చేరుకున్న కేసీఆర్‌ దంపతులు..  చండీయాగంలో భాగంగా నిర్వహించే పూర్ణాహుతిలో పాల్గొన్నారు. కేసీఆర్‌ వెంట మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి ఉన్నారు. (చదవండి : కొండంత సంబురం నేడే)

పూర్ణాహుతి ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఎర్రవల్లి, మర్కూక్‌ గ్రామాల్లో నిర్మించే రైతు వేదికలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత కేసీఆర్‌ మర్కూక్‌ పంప్‌హౌస్‌ వద్దకు చేరుకొని చినజీయర్‌ స్వామికి స్వాగతం పలుకనున్నారు. అక్కడ నిర్వహించే సుదర్శన యాగం పూర్ణాహుతిలో ఆయన పాల్గొంటారు. అనంతరం 11.30 గంటలకు పంప్‌హౌస్‌లలోని రెండు మోటార్లను ఆన్‌ చేసి గోదావరి ఎత్తిపోతలకు కేసీఆర్‌ శ్రీకారం చూట్టనున్నారు.

మరిన్ని వార్తలు