ఎక్కడి గొర్రెలు అక్కడికే!

14 Oct, 2017 16:01 IST|Sakshi

గప్‌చుప్‌గా చేతులు మారుతున్న జీవాలు

 యథేచ్ఛగా అమ్ముకుంటున్న లబ్ధిదారులు

 నిలువరించలేకపోతున్న అధికారులు

 ఇప్పటికీ జాడలేని పర్యవేక్షణ కమిటీలు

 ప్రహసనంగా మారుతున్న సర్కారు పథకం

అల్లాదుర్గం(మెదక్‌): గొర్రెల పంపిణీ వ్యవహారం రానురాను ప్రహసనంగా మారుతోంది. లబ్ధిదారులు గొర్రెలను తాము పెంచుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో అవి చేతులు మారుతున్నాయి. అధికారులు కూడా దీనిని నివారించలేకపోతున్నారు. గొల్లకుర్మలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దే శంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి గ్రామంలో సంఘాలు ఏర్పాటు చేసి విడతలవా రీగా ఒక్కో లబ్ధిదారునికి 21 గొర్రెల చొప్పున అందజేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలను పెంచుకుంటూ వారు జీవనోపాధి పొందుతారని స ర్కారు ఆశించింది. పంపిణీ చేసిన గొర్రెల పెంపకం సజావుగా జరుగుతుందా..లేదా పర్యవేక్షించేందుకు ఓ కమిటీని వేయనున్నట్లు ప్రకటించిం ది. ఇతర రాష్ట్రాల నుంచి జీవాలను తెచ్చి పంపిణీ చేసింది. కమిటీలను వేయకపోవడంతో ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడికే గొర్రెలను తరలించి లబ్ధిదారులు యథేచ్చగా అమ్ముకుంటున్నారు. వాటిని అమ్మినా, కొన్నా కేసులు నమోదు చేస్తామని అధికారులు హెచ్చరించినా ఫలితం కనిపించ డం లేదు. దాదాపు జిల్లా అంతటా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 

ఉదాహరణకు....అల్లాదుర్గం మండలంలో ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలను లబ్ధిదారులు యథేచ్ఛగా అమ్ముకుంటున్నారు. మండలంలోని మందాపూర్‌లో 23, ముప్పారంలో 39, చిల్వెరలో 30, వెంకట్‌రావ్‌పేటలో 14, రాంపూర్‌లో 13 యూనిట్లను అందజేశారు. ముప్పారం, చిల్వెర గ్రామాలకు చెందినవారు ఇప్పటికే సగం వరకు గొర్రెలను అమ్ముకున్నారు. ఇటీవల ముప్పారం గ్రామంలో రెండు టాటా ఎసీలలో గొర్రెలను తరలి స్తుండగా ‘సాక్షి’ తన కెమెరాలో బంధించింది. ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసిన గొర్రెలను ఏడాది వరకు అమ్మవద్దనే నిబంధనలు ఉన్నాయి. అల్లాదుర్గం మండలంలో మాత్రం మూడు నెలలకే అమ్మేశారు. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.

ఏర్పాటు కాని పర్యవేక్షణ కమిటీలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గొర్రెల పథకం నీరుగారిపోతోంది. గొర్రెల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటి కీ అది అమలుకు నోచుకోలేదు. ఎంపీడీఓ, తహసీల్దార్, పశువైద్యాధికారితో కలిపి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అవి ఏర్పడే లోపు గొర్రెలన్నీ మాయమయ్యేలా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు