సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ‘‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు సీట్లు తగ్గుతాయని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి.. దేశ రాజకీయాలను సీఎం కేసీఆర్ నడిపిస్తారు.. ఇందుకు అవసరమైన ఇన్పుట్స్ ఇస్తారు.. ’’ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ‘‘సీఎం కేసీఆర్ రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన చేశాకే రైతుబంధు పథకాన్ని అమలు చేశారు. నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు.. ఇప్పుడు కేంద్రం కూడా రైతుబంధు పథకాన్ని దేశమంతా అమలు చేస్తోంది. భూ రికార్డుల ప్రక్షాళన జరగని రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎలా అమలు చేస్తారు..? ఇది ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తున్నట్లే అవుతుంది..’’ అని ఎంపీ దుయ్యబట్టారు. శుక్రవారం మంత్రి వేముల ప్రశాంత్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. జాతీయ రాజకీయాల్లో మార్పును కోరుకుంటున్న రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు రాష్ట్ర సమస్యలు పట్టవని, టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన హక్కుల సాధన కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో అన్ని కార్యాలయాలు తిరగాల్సి వచ్చిందే తప్ప కేంద్రం ముందుకు వచ్చి పరిష్కరించలేదని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయిం పు, ఎయిమ్స్ వంటి వాటి కోసం తమ ఎంపీలు కేంద్రంపై పోరాడాల్సి వచ్చిం దని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నిజామాబాద్ – పెద్దపల్లి రైల్వేలైను మూడు సంవత్సరాల్లో పూర్తి చేయిం చామని చెప్పారు.
గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీలంతా ఐదేళ్లు ప్రజలతో మమేకమై ఉన్నారని 16+1 ఎంపీ సీట్లను గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ పార్టీల వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని అన్నా రు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేష్గుప్త, నగర మేయర్ ఆకుల సుజాత, పార్టీ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి, రెడ్కో చైర్మన్ ఎస్ఏ అలీం, నాయకులు ఏఎస్ పోశెట్టి పాల్గొన్నారు.