27న కేసీఆర్‌ సింగరేణి పర్యటన 

25 Feb, 2018 02:46 IST|Sakshi

మార్చి 5న ధర్మపురి, బాసర, నిర్మల్‌ యాత్ర 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 27న సింగరేణి యాత్ర చేపట్టనున్నారు. ఆ రోజున మంచిర్యాలలోని శ్రీరాంపూర్‌ గనుల ప్రాంతంలో పర్యటిస్తారు. అనంతరం శ్రీరాంపూర్‌ ప్రగతి మైదానంలో జరిగే సమావేశంలో సింగరేణి కార్మికులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని రామగుండం 1, 2, 3 గనులు, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ గనులకు చెందిన కార్మికులకు 27వ తేదీన సెలవు ప్రకటించారు. 

మార్చి 5న ధర్మపురి, ముధోల్, నిర్మల్‌ పర్యటన 
సీఎం కేసీఆర్‌ మార్చి 5న ధర్మపురి, ముధోల్, నిర్మల్‌ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం ధర్మపురి నృసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమవుతారు. అనంతరం ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ముధోల్‌ నియోజకవర్గంలోని బాసర సరస్వతి దేవాలయంలో పూజలు జరిపి.. అక్కడ ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. సాయంత్రం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్‌లో జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయానికి, పోలీసు కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ పర్యటనలకు సంబంధించి ముఖ్యమంత్రి శనివారం ప్రగతిభవన్‌లో మంత్రులు కేటీఆర్, ఈటల, ఎంపీలు కవిత, బాల్క సుమన్, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, సింగరేణి సీఎండీ శ్రీధర్‌ తదితరులతో సమీక్షించారు. 

ముదిరాజ్‌ భవన్‌కు స్థలం కేటాయించండి 
తెలంగాణ ముదిరాజ్‌ సంఘం భవన నిర్మాణానికి హైదరాబాద్‌లో స్థలం, నిధులు కేటాయించాలని రాష్ట్ర ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు బండ ప్రకాశ్‌ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి వినతి పత్రం అందజేశారు.  

మరిన్ని వార్తలు