కేరళలో సీఎం కేసీఆర్‌ వేసవి విడిది

6 May, 2019 02:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు.. ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో గత ఆరు నెలలుగా బిజీబిజీగా గడిపిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొన్ని రోజుల పాటు బ్రేక్‌ తీసుకోనున్నారు. రాజకీయ వ్యూహాల రచన, ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయన.. ఓ నాలుగైదు రోజులు ఆహ్లాదంగా గడపనున్నారు. వేసవి విడిదిలో భాగంగా కేసీఆర్‌ సోమవారం కుటుంబ సమేతంగా కేరళ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. కేరళ పర్యటనలో భాగంగా రామేశ్వరం, శ్రీరంగం దేవాలయాలను కేసీఆర్‌ సందర్శించనున్నట్లు సీఎంవో ఆదివారం తెలిపింది.  

కేరళ సీఎంతో భేటీ.. 
కేరళ పర్యటనలో భాగంగా కేసీఆర్‌ సోమవారం సాయంత్రం 6 గంటలకు త్రివేండ్రంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌తో భేటీ అవుతారని సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై వీరిద్దరూ చర్చిస్తారని, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో దేశ రాజకీయ పరిణామాల గురించి మాట్లాడతారని తెలిపాయి.

మరిన్ని వార్తలు