రామగుండం బయల్దేరిన కేసీఆర్‌..

18 May, 2019 17:16 IST|Sakshi

సాక్షి, రామగుండం: పెద్దపల్లి, జయశంకర్‌ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ రామగుండం ఎన్టీపీసీకి చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఎన్టీపీసీలో సీఎం కేసీఆర్‌ విస్త్రత సమావేశాలు నిర్వహిస్తున్నారు. తొలుత రామగుండం ఎన్టీసీసీలో తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు స్టేజ్‌-1 ప్లాంట్‌ను సీఎం కేసీఆర్‌ సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన పవర్‌ ప్లాంట్‌ ఫోటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. పవర్‌ ప్లాంట్‌కు సంబంధించిన పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్లాంట్‌కు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పెద్దపలి, జయశంకర్‌ జిల్లాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు కేసీఆర్‌ రామగుండం వచ్చారు. పలు అభివృద్ది కార్యక్రమాలతో పాటు అధికారులతో సమీక్ష సమావేశాలను నిర్వహించనున్నారు. 

ఇవాళ రాత్రికి ఎన్టీపీసీలోని జ్యోతిభవన్‌లో కేసీఆర్‌ బస చేస్తారు. ఇక రేపు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని కేసీఆర్‌ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపు హౌస్‌, మేడిగడ్డ బరాజ్‌ పనులను కేసీఆర్‌ పరిశీలించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లో భాగంగా తెలంగాణ కోసం రామగుండం ఎన్టీపీసీలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తుండగా, తొలి విడుతలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు శరవేగం గా జరుగుతున్నాయి. రూ.10,598.98 కోట్ల వ్యయంతో రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను 2016 ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పవర్ స్టేషన్ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించారు. ప్లాంట్ నిర్మాణం కోసం మే 2015లోనే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. కాగా, దీనికి ఒడిశాలోని మందాకిని-బీ మైన్ నుంచి బొగ్గు సరఫరా చేస్తారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ పర్యావరణ అనుమతులను కూడా సాధించగా, పనులు శరవేగంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

మరిన్ని వార్తలు