చిరకాల మిత్రునికి సీఎం పరామర్శ

26 Nov, 2017 02:11 IST|Sakshi

అనారోగ్యంతో బాధపడుతున్న స్నేహితుడి ఇంటికి వెళ్లి కేసీఆర్‌ పలకరింపు  

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన చిరకాల మిత్రుడిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు శనివారం పరామర్శించారు. హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని ఉదయ్‌ సఫేర్‌ అపార్ట్‌మెంట్‌లో ఉన్న కె. రాజేంద్రప్రసాద్‌ ఇంటికి వెళ్లి ఆయన్ను పలకరించారు. గత పదేళ్లుగా రాజేంద్రప్రసాద్‌ పక్షవాతం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

ఆరు నెలల క్రితమే ఆయన్ను సీఎం కలవాలనుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల చివరి క్షణంలో ఆ పర్యటన వాయిదా పడింది. అయినప్పటికీ స్నేహితుడిని గుర్తుపెట్టుకుని శనివారం పరామర్శించారు. దాదాపు 45 నిమిషాలపాటు స్నేహితుని ఇంట్లో గడిపారు. కాంగ్రెస్‌వాది అయిన రాజేంద్రప్రసాద్‌ యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో కేసీఆర్‌ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

అనేక కార్యక్రమాలలో కలసి పాల్గొన్న వారిద్దరూ అంతకుముందు నుంచే స్నేహితులు. గుంటూరు జిల్లా రేపల్లె నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1985లో రాజేంద్రప్రసాద్‌ పోటీ చేశారు. తనను గుర్తుపెట్టుకుని సీఎం పరామర్శించడం చాలా ఆనందంగా ఉందని రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. అప్పటి విషయాలను నెమరేసుకున్నామన్నారు.

మరిన్ని వార్తలు