కేసీఆర్‌ పీఎం బనేగా 

9 Apr, 2019 19:59 IST|Sakshi
నారాయణపేటలో మాట్లాడుతున్న మహమూద్‌ అలీ

16 ఎంపీ స్థానాలు టీఆర్‌ఎస్‌వే.. 

హోంమంత్రి మహమూద్‌ అలీ 

పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో విస్తృత ప్రచారం 

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటివరకు దేశంలోని మైనార్టీలకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు చేసిందేమి లేదు.. అందరు టైంపాస్‌ చేసి వెళ్లిపోయారు.. సీఎం కేసీఆర్‌ ఒక్కరే మైనార్టీల సంక్షేమం గురించి ఆలోచించారు.. వారికి పెద్ద పీట వేసి పెద్దన్నలా భరోసా ఇచ్చారు.. రాష్ట్రంలో 16 స్థానాలు టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటే దేశంలో ఫెడరల్‌ఫ్రంట్‌ అధికారంలోకి వస్తుంది.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పీఎం అవుతారు.. అని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు.

సోమవారం రాత్రి 8 గంటలకు పాలమూరులోని మదీనా మజీద్‌ ప్రాంతంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలను నేరుగా కలుస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఙప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే మైనార్టీలకు మేలు జరుగుతుందని, కుల, మత రాజకీయాలు చేస్తున్న పార్టీలను నమ్మొద్దని పిలుపునిచ్చారు. 

దేశానికి వఫాదార్‌ కావాలి 

ప్రస్తుత ప్రధాని లాంటి చౌకీదార్‌.. రాహుల్‌ గాంధీ లాంటి టేకేదార్‌ లాంటి వ్యక్తులు దేశానికి  అవసరం లేదని, సీఎం కేసీఆర్‌ లాంటి వఫాదార్, జిమ్మేదార్‌ వ్యక్తి అవసరమని మహమూద్‌ అలీ అన్నారు. ప్రదాని జిల్లాకు వచ్చి స్థానిక సమస్యల గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రిని విమర్శించి వెళ్లిపోయారని ఆరోపించారు. మంత్రి వెంట ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు వెంకటయ్య, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

 సోలా ఎంపీ.. పీఎం పక్కా 

నారాయణపేట: ‘తెలంగాణ స్టేట్‌ మే సోలా ఎంపీ టీఆర్‌ఎస్‌ ఆద్మి జీతేగా.. సీఎం కేసీఆర్‌ పీఎం బనేగా.. అంటూ హోంమంత్రి మహమూద్‌ అలీ జోస్యం చెప్పారు. సోమవారం రాత్రి 9 గంటలకు నారాయణపేటలోని మసూమ్‌అలీ దర్గా వద్ద స్థానిక ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం మైనార్టీల ప్రచార సభకు హోంమంత్రి హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్ర చరిత్రలో ముస్లిం మైనార్టీలకు ఎప్పుడు డిప్యూటీ సీఎం పదవీగాని, క్యాబినేట్‌లో ఉన్నత మంత్రి పదవులు ఇచ్చిన దాఖాలాలు లేవని,  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని వర్గాలకు ప్రాముఖ్యత ఇచ్చారని కొనియాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్‌ నగరంలో అల్లర్లు తగ్గిపోయాయన్నారు.  

>
మరిన్ని వార్తలు