కిరోసిన్‌ ఎగ్గొట్టి..

9 May, 2020 10:31 IST|Sakshi

రెండు మూడు నెలలుగా కోటా కేటాయింపులకే సరి

చౌకధరల దుకాణాలకు సరఫరా కాని వైనం

పాత మిగులుబాటు నిల్వల సర్దుబాటు

సాక్షి, సిటీబ్యూరో: పేదల సబ్సిడీ కిరోసిన్‌ పత్తాలేకుండా పోయింది. పౌరసరఫరాల శాఖ ప్రతి నెల కిరోసిన్‌ కోటా కేటాయిస్తున్నా..ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు మాత్రం సరఫరా కావడం లేదు. గత రెండు, మూడు నెలల నుంచి కిరోసిన్‌ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా లబ్ధిదారులకు కిరోసిన్‌ అందని దాక్ష్రగా తయారైంది. కమిషన్‌ పెంపు కోసం సమ్మెలో  భాగంగా మధ్యలో కొన్ని నెలలుసంబంధిత ఏజెన్సీలు కిరోసిన్‌ సరఫరాను నిలిపివేయగా, తాజాగా లాక్‌డౌన్‌తో గత రెండు మాసాలుగా కిరోసిన్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ చౌక ధరల దుకాణాల డీలర్లు పాత నిల్వలను లబ్ధిదారులకు కిరోసిన్‌ సర్దుతున్న తెలుస్తోంది. గత నెలలో ఉచిత బియ్యం పంపిణీ హడావుడి కారణంగా కిరోసిన్‌ కోటాకు పెద్దగా డిమాండ్‌ లేనప్పటికి ఈసారి కిరోసిన్‌ కోటాను లబ్ధిదారులు అడిగి మరి డ్రా చేస్తుండటంతో కిరోసిన్‌ కొరత నెలకొంది. సంబంధిత అధికారులు మాత్రం కోటా కేటాయించి సరఫరాను గాలీకి వదిలేయడం విస్మయానికి గురిచేస్తోంది.

నాలుగు లక్షలపైనే కుటుంబాలు
గ్రేటర్‌ పరి«ధి కిరోసిన్‌ లబ్ధి కుటుంబాలు సుమారు నాలుగు లక్షలపైనే ఉన్నాయి. పౌరసరఫరాల శాఖ ప్రతి నెల ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలతోపాటు దీపం కనెక్షన్‌ కలిగిన కుటుంబాలకు ఒక్కో లీటర్‌ చొప్పున కిరోసిన్‌ కోటాను కేటాయిస్తుంది. సంబంధిత కిరోసిన్‌ ఎజెన్సీలు ప్రతి నెల మొదటి వారంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు సరఫరా చేస్తూ వస్తున్నాయి. తాజాగా నెలకొన్న పరిస్థితులతో కిరోసిన్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది.

ఇదీ పరిస్ధితి..
హైదరాబాద్‌ జిల్లాలో ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలు 5,80,781 ఉండగా అందులో ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలు  85,897, దీపం కనెక్షన్లు గల కుటుంబాలు 81,105 వరకుఉన్నారు. మొత్తం మీద1,67,002 లీటర్ల కిరోసిన్‌ కోటా అవసరం ఉంటుంది. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల్లో పాత కోటాకు సంబంధించి 10,974 లీటర్ల కిరోసిన్‌ నిల్వలు అందుబాటులో ఉండగా, మిగిలిన 1,56,028 లీటర్ల  కోటాను కేటాయించారు. కానీ, సంబంధిత కిరోసిన్‌ ఏజెన్సీల నుంచి ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు కిరోసిన్‌ మాత్రం సరఫరా జరుగలేదు.
మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 4,95,267 కార్డులు ఉండగా, అందులో ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలు 73,933, దీపం కనెక్షన్‌ కలిగిన కుటుంబాలు  20,249 వరకు ఉన్నాయి.  మొత్తం మీద 94,182 లీటర్ల కిరోసిన్‌ కోటా అవసరం ఉండగా, ప్రభుత్వ చౌకధరల దుకాణాలలో సుమారు 5,823 లీటర్ల కిరోసిన్‌ నిల్వ ఉంది. దానిని మినహాయించి మిగిలిన 88,359 లీటర్ల  కిరోసిన్‌ కేటాయించారు. కానీ సరఫరాల మాత్రం లేకుండా పోయింది.
రంగారెడ్డి జిల్లాలో 5,24,882 కార్డులు ఉండగా, అందులో ఎల్పీజీ కనెక్షన్లు లేని కుటుంబాలు 1,02,013, దీపం కనెక్షన్‌గల 40,782 కుటుంబాలున్నాయి. మొత్తం మీద 1,42 795 లీటర్ల కిరోసిన్‌ అవసరం ఉండగా, ప్రభుత్వ చౌకధరల దుకాణాలోల 3254 లీటర్లు అందుబాటు ఉంది. మిగిలిన 139,541 లీటర్లను కేటాయించారు. కానీ..సరఫరా మాత్రం కాలేదు.

మరిన్ని వార్తలు