సాయంత్రం ఓపీ.. 

28 Aug, 2019 02:42 IST|Sakshi

జ్వరాల తీవ్రత నేపథ్యంలో సర్కారు కీలక నిర్ణయం 

ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రుల్లో తక్షణం అమలు

సాక్షి, హైదరాబాద్‌: అన్ని ప్రాంతీయ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఔట్‌ పేషెంట్లను (ఓపీ) చూడాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదు అవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జ్వరాలపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఓపీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు నిర్వహిస్తున్నారు.

బుధవారం నుంచి సాయంత్రం 4 నుంచి ఆరేడు గంటల వరకు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతోపాటు అవసరమైన మందులు, ఆసుపత్రుల్లో మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 31 జిల్లా ఆసుపత్రులు, 22 ఏరియా ఆసుపత్రులు, 9 బోధనాసుపత్రులు ఉన్న విషయం తెలిసిందే. వీటిల్లో తక్షణమే సాయంత్రం వేళ ఓపీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇదిలావుండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు అధికారులు అంచనా వేశారు.  

వైద్య బడ్జెట్‌ రూ. 5,500 కోట్లు! 
వచ్చే బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌ రూ.5,500 కోట్లు ఉండే అవకాశముందని సమాచారం. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. గత ఆర్థిక బడ్జెట్‌ రూ.6,900 కోట్లు ఉండగా, ఖర్చు పెట్టిన దాన్ని ఆధారంగా వాస్తవ రూపంలో తాజాగా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు