బీజేపీ నేత కుమారుడు లండన్‌లో మిస్సింగ్‌

24 Aug, 2019 09:47 IST|Sakshi

లండన్‌లో అదృశ్యమయిన హర్ష

ఆయన తండ్రి ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్

సాక్షి, ఖమ్మం​: లండన్‌లో పీజీ చదువుతున్న ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ కొడుకు హర్ష శుక్రవారం మధ్యాహ్నం అదృశ్యమయ్యడు. అతనిపై లండన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. దీంతో ఉదయ్‌ప్రతాప్‌ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. లండన్‌లో శుక్రవారం హర్ష అదృశ్యమయ్యాడని అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా హతాశులయ్యారు. అక్కడ పీజీ కోర్సు చదువుతున్న హర్ష కనిపించకుండా పోయాడని హాస్టల్‌ నిర్వాహకులు అక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఖమ్మంలోని అతడి తల్లిదండ్రులకు శుక్రవారం అర్థరాత్రి సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఫోన్‌లో ఉదయ్‌ప్రతాప్‌తో మాట్లాడారు. లండన్‌లోని దౌత్య అధికారులతో మాట్లాడి హర్ష ఆచూకీ కనుక్కునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. విదేశాంగ శాఖతో పాటు... లండన్‌లో ఉన్న తెలుగు వాళ్లతో తాను మాట్లాడతాననీ... ప్రత్యేకంగా కేంద్రానికి లెటర్ రాసి... హర్ష ఆచూకీ తెలుసుకోవడానికి తన వంతు సహకారం అందిస్తానని నామా భరోసా ఇచ్చారు. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలతో ఇదే సమస్య. ఖండాలు దాటి వెళ్లి... అయినవాళ్లకు దూరంగా బతికే వాళ్లు కనిపించకుండాపోతే వారి బాధ మాటలకందనిది. హర్ష క్షేమంగా తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులతో పాటు, ఖమ్మం వాసులు కోరుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు