వాణిజ్య బ్యాంకులకు దీటుగా సేవలు

2 Jul, 2018 17:45 IST|Sakshi
మాట్లాడుతున్న డీసీసీబీ చైర్మెన్‌ మువ్వా విజయ్‌బాబు  

రాష్ట్రంలోనే ఖమ్మం సహకార బ్యాంక్‌ను అగ్రభాగాన నిలిపాం

మండలానికి ఒక బ్రాంచిని ఏర్పాటు చేశాం డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు

ఖమ్మంవ్యవసాయం : ఖమ్మం కేంద్ర సహకార బ్యాంక్‌(డీసీసీబీ) ద్వారా వాణిజ్య బ్యాంకులకు దీటుగా సేవలు అందిస్తున్నట్లు చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు అన్నారు. బ్యాంకు లావాదేవీలను విస్త్రృతంగా పెంచి రాష్ట్రంలో అగ్రభాగాన నిలిపామన్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లా కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(డీసీసీబీ ఈయూ) సర్వసభ్య సమావేశం ఆదివారం ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ ప్రధాన కార్యాలయంలో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య ఆయన అతిథిగా హాజరైన మాట్లాడారు. మరో రెండేళ్లయితే సహకార వ్యవస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదేళ్ల కిత్రం రైతాంగం, సహకార సంఘాలు డీసీసీబీకి సేవచేసే అవకాశాన్ని ఇచ్చాయన్నారు. తాను పదవిని చేపట్టేనాటికి రూ.800 కోట్ల టర్నోవర్‌తో ఉన్న ఈ బ్యాంక్‌ నేడు రూ. 2,115 కోట్ల టర్నోవర్‌కు చేరుకుందన్నారు. డిపాజిట్‌లతో బ్యాంక్‌ అభివృద్ధి చెందుతుందని భావించి ఆ దిశగా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్‌లతో మాట్లాడి వివిధ పథకాల కింద వచ్చిన నిధులను డిపాజిట్‌లు చేయించామన్నారు. బ్రాంచిలను ఆధునికీకరించామన్నారు. దీంతో రైతుల్లో సహకార బ్యాంక్‌పై నమ్మకం పెరిగిందన్నారు. 30 బ్రాంచిలతో ఉన్న ఖమ్మం డీసీసీబీని నేడు 50 బ్రాంచిలకు పెంచామన్నారు. మరో 8 బ్రాంచిలకు ప్రతిపాదనలు కూడా చేశామన్నారు. కొత్తగూడెం, పాల్వంచ వంటి పట్టణాల్లో నూతన బ్రాంచిల ఏర్పాటుకు కృషి జరుగుతుందన్నారు.

ప్రతి మండలంలో డీసీసీబీ బ్రాంచి ఏర్పాటు చేయటం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఆ లక్ష్యం నెరవేరిందన్నారు.  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో బ్యాంక్‌ను అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. సంక్షేమ నిధి తో ఏర్పాటయిన సీ-స్టార్‌ ఆస్పత్రిని ఎన్ని అవాంతరాలు వచ్చినా నిర్వహించి తీరుతామన్నారు. డీసీసీబీ ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనం రూ. 5లక్షలను ఆసుపత్రి అభివృద్ధికి ఇవ్వటం అభినందనీయమన్నారు.

నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యోగ సంఘానికి  గౌరవ అధ్యక్షడిగా బాధ్యతలు అప్పగించారని, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి ఉంటుందన్నారు. కార్యక్రమంలో బ్యాంక్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి వసంతరావు మాట్లాడుతూ వాణిజ్య బ్యాంకులకు దీటుగా డీసీసీబీని ముందుకు తీసుకుపోవాలని కోరారు.

ఈ నూతనకమిటీ అధ్యక్షులు జిప్రవీణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాలకవర్గసభ్యులు బోజెడ్ల అప్పారావు, మండే వీరహన్నంతరావు, రాయల శేషగిరిరావు, పోలుదాసు కృష్ణమూర్తి, సామినేని వెంకటయ్య, తాతా రఘురాం, బెఫీ యూనియన్‌ ప్రతినిధి ఆనందరావు, సంఢం ప్రధాన కార్యదర్శి కె.ఉపేంద్రనాథ్, ఉపాధ్యక్షులు రాయపూడి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బి.రవికుమార్, కోశాధ్యక్షులు చందర్‌రావు, నిర్వహణా కార్యదర్శి వెంకటరెడ్డి, ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు