‘పరదా’ పడినట్టే!

13 Oct, 2019 09:10 IST|Sakshi
పరదాగేట్‌ ప్యాలెస్‌

ప్రైవేటు కంపెనీకి అమ్మేసిన నిజాం ట్రస్ట్‌

పరదాగేట్‌ను కొన్న ముంబైవాలా

5,000 గజాల విస్తీర్ణం, రూ. 150 కోట్ల వ్యయం 

కింగ్‌కోటి ప్యాలెస్‌లో ఐరిస్‌ బిజినెస్‌ మాల్స్‌

అలనాటి నిజాం చరిత్ర వైభవానికి ఆనవాలుగా ఉన్న కింగ్‌కోఠి ప్యాలెస్‌ (పరదాగేట్‌) ఇక కనుమరుగుకానుంది. చారిత్రక వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ ప్యాలెస్‌ కనుమరుగుకానుందన్న వాస్తవం పురావస్తు, చరిత్ర ప్రేమికులు జీరి్ణంచుకోవటమూ కాస్త కష్టమే మరి. మొఘల్, యూరోపియన్‌ అద్భుత వాస్తు నిర్మాణ శైలితో ఎన్నో ప్రత్యేకతల్ని సంతరించుకున్న ఈ భవనం నిజాం రాజులనాటి చారిత్రక వైభవానికి కింగ్‌కోఠి ప్యాలెస్‌ శిథిల సజీవ సాక్ష్యం. 70 ఏళ్లుగా నిజాం వారసుల చేతుల్లో ఉన్న ఈ భారీ భవనం యాజమాన్య హక్కులు గతంలోనే చేతులు మారాయి. ఢిల్లీకి చెందిన ప్రముఖ హోటల్స్‌ సంస్థ ఐరిస్‌ ఈ భారీభవంతిని కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ భవనాన్ని కూల్చి ఓ భారీ బిజినెస్‌ మాల్‌ను నిర్మించేందుకు ఐరిస్‌ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. దీంతో కింగ్‌కోఠి ప్యాలెస్‌ కాస్తా ఇక నుంచి బిజినెస్‌ మాల్‌గా మారనుందని తెలుస్తోంది.
– సాక్షి, హైదరాబాద్‌

చేతులు మారిందిలా.. 
ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ వ్యక్తిగత నివాసంగా వెలుగొందిన ఐదువేల గజాల విస్తీర్ణంలో ఉన్న భారీ భవంతి నజ్రీభాగ్‌ (పరదాగేట్‌)కు చాలాకాలం ప్రిన్స్‌ ముకర్రంజా మొదటి భార్య ఎస్త్రా జీపీఏ హోల్డర్‌గా వ్యవహరించారు. ఎస్త్రా నుంచి ముంబైకి చెందిన నిహారిక కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీ కొనుగోలు చేయగా తాజాగా నిహారిక కన్‌స్ట్రక్షన్స్‌ నుంచి ఐరిస్‌ హోటల్స్‌ సంస్థ రూ.150 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఐదెకరాల విస్తీర్ణంలో కింగ్‌కోఠి ప్యాలెస్‌లో ఉన్న మూడు భవనాల్లో ఒకదాన్లో ఈఎన్‌టీ ఆస్పత్రి నడుస్తుండగా, మరో భవనంలో నిజాంట్రస్ట్‌ కొనసాగుతోంది. 

పరదా కథ 
కింగ్‌కోఠి ప్యాలెస్‌లోని ప్రధాన భవనం (నజ్రీబాగ్‌) పరదాగేట్‌గా ఇప్పటికీ ప్రసిద్ధే. ఈ భవనం ఇప్పటికీ పరదా వేసి ఉండటమే విశేషం. అప్పట్లో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ నివాస కేంద్రంగా కొనసాగిన ఈ భవంతిలో ఆయన ఉంటేనే పరదాని పైకి లేపి ఉంచేవారు. పరదా కిందకు వేసి ఉంటే ఆయన రాజ్య పర్యటనలో ఉన్నారని అర్థం. నిజాం రాజు నిత్యం వెళ్లే దారిని నీళ్లతో కడిగి శుద్ధి చేసేవారు. ఇక్కడ నిత్యం సాయుధ పోలీస్‌ బలగాలతో భారీ పహారా ఉండేది. నిజాం నవాబు ఉస్మాన్‌ అలీఖాన్‌ ఈ భవనంలోనే తుది శ్వాస విడువగా ఆయన సమాధి సైతం ఈ పరిసరాల్లోనే (జుడీ మస్జీద్‌) ఉండటం విశేషం. 

హెరిటేజ్‌ జాబితాలోనే 
కమాల్‌ఖాన్‌ ఆధ్వర్యంలో మొఘల్, యూరోపియన్‌ అద్భుత వాస్తు నిర్మాణ శైలితో నిర్మించిన ఈ భవనానికి దేశంలోనే అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ నిర్మాణ శైలిని చూసేందుకు అనేక దేశాల ఆర్కిటెక్టులు వచ్చి పరిశీలించిన సందర్భాలున్నాయి. ఈ భవనం చాలాకాలం హెరిటేజ్‌ జాబితాలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో హెరిటేజ్‌ భవనాల జాబితా ఏదీ అధికారికంగా లేకపోవటంతో ఈ భవనాన్ని ఐరిస్‌ హోటల్స్‌ కూలి్చవేసే అవకాశమే కనిపిస్తోంది. ఈ భవనానికి సరైన నిర్వహణ లేకపోవటంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఈ విషయమై ఇంటా క్‌ తెలంగాణ చాప్టర్‌ అధ్యక్షురాలు అనురాధారెడ్డి స్పందిస్తూ.. నజ్రీబాగ్‌ ఎప్పటి నుంచో హెరిటేజ్‌ భవనంగా ఉందని, ఆ భవనం కూలి్చవేతను అడ్డుకుంటామని పేర్కొన్నారు. 

కొనుగోలు వివాదం  
నిజాం ట్రస్ట్‌ నుంచి ఈ భవనాన్ని తొలుత నిహారిక ఇన్‌ఫ్రా కంపెనీ కొనుగోలు చేయగా, ఇదే కంపెనీలోని ఇద్దరు డైరెక్టర్లు మాత్రమే ఐరిస్‌ హోటల్స్‌కు విక్రయించారు. ఈ విషయమై నిహారిక డైరెక్టర్లు వర్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆ రిజిస్ట్రేషన్‌ చెల్లుబాటు కాకుండా చూడాలని కోరారు. ఈ మేరకు ఓ లేఖ సైతం హైదరాబాద్‌ జిల్లా రిజి్రస్టార్‌కు చేరింది. ఈ విషయమై రిజి్రస్టార్‌ డీవీ ప్రసాద్‌ను వివరణ కోరగా తాము అన్ని పరిశీలించాకే రిజిస్టర్‌ చేసినట్లు ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు