తెలుగువారితో కిషన్‌రెడ్డి లైవ్‌ 

14 Mar, 2019 04:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘భారత్‌ కీ మన్‌కీ బాత్‌ మోదీ కే సాథ్‌’ కార్యక్రమంలో భాగంగా బీజేపీ పూర్వ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో లైవ్‌ కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారితో మాట్లాడి బీజేపీ మేనిఫెస్టో కోసం వారి అభిప్రాయాలను బుధవారం సేకరించారు. ఈ లైవ్‌ కార్యక్రమంలో విద్య, ఉపాధి, వైద్యం, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, తీవ్ర వాదం, వ్యవసాయం వంటి అంశాలపై ఆన్‌లైన్‌లో ప్రజలు కిషన్‌ రెడ్డితో ముచ్చటించారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డు పడకుండా చూడాలని కోరారు.

ఆవాస్‌ యోజన కింద ఇచ్చే మొత్తాన్ని పెంచాలని, ఎన్నికల్లో డబ్బు ప్రవాహం తగ్గించడానికి ఎన్నికల సంస్కరణలను తీసుకురావాలని చెప్పారు. వీటిపై కిషన్‌రెడ్డి స్పందిస్తూ బీజేపీ ప్రజల అభిప్రాయాల మేరకు నడుచుకునే పార్టీ కానీ ఒక కుటుంబం అభిప్రాయం మేరకు నడుచుకునే పార్టీ కాదన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు మేనిఫెస్టోను రూపొందించి ప్రజల ముందు పెడతామన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ గెలిచినా ఢిల్లీలో వాళ్లు చేసేది ఏమీ లేదు కాబట్టి అత్యధిక స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు