రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన చూస్తున్నాం: మంత్రి

19 Oct, 2019 17:21 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : ఎప్పుడు చూడని తుగ్లక్ పాలన ఇప్పుడు చూస్తున్నామని.. కేసీఆర్ ఓ పిచ్చి తుగ్లక్ అని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మఠంపల్లిలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ అభ్యర్ధి కోట రామారావును గెలిపించాలని కోరారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని.. కేసీఆర్‌ నియంతలా మారి నిరంకుశ పాలన చేపడుతున్నారన్నారు. రాష్ట్రంలో హక్కుల గురించి అడిగే హక్కు ఏ సంఘాలకు లేకుండా కేసీఆర్‌ చేశారన్నారు. హుజూర్‌నగర్‌ నియోజక వర్గంలో ఉన్న 14 సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి ఏడాదికి వచ్చే రూ. 300 కోట్లు.. ఈ ప్రాంతానికి ఖర్చు చేయట్లేదని మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఎంఐఎంతో కలిసి కేసీఆర్ నిజాం పాలన చేస్తున్నారని, 50 వేల ఆర్టీసీ ఉద్యోగులను తొలిగించింన ఘనత కేసీఆర్‌కే చెల్లిందన్నారు. ఉద్యోగ నియామకాలు లేవని.. ఉన్న ఉద్యోగాలను కేసీఆర్‌ తొలగిస్తున్నారని మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల హామీలో భాగంగా కేసీఆర్‌ ఇస్తానన్న.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, రైతు రుణమాఫీ ఎక్కడా అని ప్రశ్నించారు. మహిళ సంఘాలకు పావలా వడ్డీ రుణాలు, నిరుద్యోగులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని కేసీఆర్‌ తీరును ఎండగట్టారు. ఉప ఎన్నికతో కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని మంత్రి ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. 2023లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్‌ మునిగిన నావ
ఉత్తమ్  హుజూర్‌నగర్‌కు చేసిందేమి లేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హుజూర్ నగర్‌లో గెలిచినా.. ప్రయోజనం ఉండబోదనీ, కాంగ్రెస్‌ మునిగిన నావ అన్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో 19 సీట్లు గెలిస్తే.. అందులో 13 మంది టీఆర్‌​ఎస్‌లో చేరారని గుర్తు చేశారు. ఇక తెలంగాణ, దేశంలో.. ఉత్తమ్, రాహుల్ గాంధీ కాలం చెల్లిపోయిందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మరిన్ని వార్తలు