హైకోర్టు సీజేగా ఆర్‌ఎస్‌ చౌహాన్‌.. కొలీజియం సిఫారసు

13 May, 2019 18:47 IST|Sakshi
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం చౌహన్ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా వ్యవహరిస్తున్నారు. ఇక హైకోర్టు లో నెంబర్ 2 స్థానంలో ఉన్న జస్టిస్ వీ. రామసుబ్రమణియన్ కు పదోన్నతి ఇవ్వాలని కూడా కొలీజియం నిర్ణయించింది. ఆయనను హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సిఫార్సు చేసింది. ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగాయి.. జస్టిస్ బాబ్దే.. జస్టిస్ ఎన్‌ వీ రమణలతో కూడిన కొలీజియం సమావేశమై ఈ సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను కేంద్రం ఆమోద ముద్ర వేసిన తరువాత ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోదం తరువాత వీరి నియామక నోటిఫికేషన్ జారీ అవుతుంది. జస్టిస్ చౌహాన్ నేపథ్యం... జస్టిస్‌ చౌహాన్‌ 1959 డిసెంబర్‌ 24న జన్మించారు. 1980లో అమెరికాలో ఆర్కాడియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. 2005లో రాజస్థాన్‌ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది ఉమ్మడి హైకోర్టుకు బదిలీపై వచ్చారు. హైకోర్టు విభజన తరువాత ఆయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన న్యాయమూర్తి గా ఉన్న జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల కలకత్తా హైకోర్టు కి బదిలీ అయ్యారు. దీనితో సీనియర్ అయిన జస్టిస్ చౌహాన్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గా నియమితులై అదే పోస్టులో కొనసాగుతున్నారు. జస్టిస్ రామసుబ్రమణియన్ నేపథ్యం... జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ 1958 జూన్‌ 30న జన్మించారు. మద్రాసు వివేకానంద కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. 1983లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. సినీయర్‌ న్యాయవాదులు కె. సార్వభౌమన్‌, టి.ఆర్‌. మణిల వద్ద న్యాయ మెళకులు నేర్చుకున్నారు. 2006 జూలై 31న మద్రాసు హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009 నవంబర్‌ 9న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి గా నియమితులయ్యారు. హైకోర్టు విభజన తరువాత కేంద్రం ఈయనను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి గా నియమించింది.
మరిన్ని వార్తలు