ఉద్యమ వీరుడు మళ్లీ పుట్టాల్సిందే(నా)?

13 Oct, 2019 09:34 IST|Sakshi

జోడేఘాట్‌కు ‘మహా’ గిరిజనులు

ఆయన ఆశయం చిరస్మరనీయం

చట్టాలను కాలరాస్తున్న వైనం

నేడు భీం 79వ వర్ధంతి

నాడు బ్రిటీష్‌ కదంబహస్తాల నుంచి భారతీయులను విడదీసేంచేందుకు స్వాతంత్ర పోరాటం చేసి అమరుడయ్యాడు జాతిపిత మహాత్మగాంధీ..! అలాగే చరిత్రలోనే అమర జీవిగా జల్‌.. జంగల్‌.. జమీన్‌ అనే నినాదంతో అప్పటి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిపి అసువులు బాసాడు గిరిజన ముద్దబిడ్డ కుమురం భీం.. ఆయన పోరాటం చేసి 79ఏళ్లు గడస్తున్నా ఆశయం మాత్రం నెరవేర లేదు. నేటికి తాగు, సాగునీరు లేక రోడ్డు సౌకర్యం కనపడక.. సాగుచేస్తున్న భూములకు పట్టాలు లేక  అలమటిస్తున్న పల్లెలు కోకొలలు.. అందుకే భీం నువ్వు మళ్లీ పుట్టాలి. అని కోరుతున్నారు గిరిజనులు. నేడు 79వ వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన పోరాట పటిమపై ప్రత్యేక కథనం. 

కెరమెరి(ఆసిఫాబాద్‌): శనివారం కుమురం భీం 79వ వర్ధంతి ఉందని భావించిన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన వివిధ గ్రామాల ఆదివాసీ గిరిజనులు జోడేఘాట్‌కు భారీగా తరలివచ్చారు. వందలాది మంది తరలిరావడంతో జోడేఘాట్‌కు కొత్త కళ వచ్చింది. ఇక్కడికి వచ్చిన వారికి భీం వర్ధంతి ఆదివారం ఉందని తెలియడంలో అసంతృప్తికి లోనయ్యారు. కొందరు జీపుల్లో రాగా మరికొందరు వ్యాన్లలో, బైకులతో తరలివచ్చారు. భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం బృందావనంలో కాలక్షేపం చేశారు. మ్యూజియంలో భీం ప్రతిమలు, గుస్సాడీల నృత్యాలు  ప్రతిమలు, పురాతన ఆభరనాలు, దేవతల విగ్రహాలు, మ్యూజియంలో ఉన్న పరికరాలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.

వినియోగంలోకి రాని 5వ షెడ్యూల్‌
భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్‌ ప్రకారం అడవి, భూమి, నీరుపై పూర్తి హక్కు ఉన్నప్పటికీ నూతన చట్టాలు వాటికి తూట్లు పొడుస్తున్నాయి. రాజ్యాంగానికి భంగం కలిగిస్తున్నాయి. 2005 బిల్లు ప్రవేశపెట్టి హక్కులను కల్పిస్తామని గతంలోని ప్రభుత్వాలు చెప్పినా అవి అమలు కాలేదు. ఏజెన్సీ ప్రాంతంతోని నీటి వనరులు పూర్తిగా ఆదివాసీలకే దక్కాలని రాజ్యాంగంలో ఉంది. కుంటలు, చెరువుల నిర్మాణంలో ఆదివాసీలు భూములు కోల్పోయి గిరిజనేతరులకు ఆ నీరు వినియోగమవుతోంది. ఐటీడీఏ నిధులతో నిర్మించినా కుంటలు, చెరువుల్లో పెంచబడే చేపలు, రొయ్యలపై హక్కు ఆదివాసీలకే దక్కాలని చట్టాలు చెబుతున్నా వారి గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. గిరిజన చట్టాలను అమలుచేయక గతంలో అధికారులు లాఠీన్యం చేసిన సందర్భాలు లేకపోలేదు. కొంత కాలంగా ఇతర ప్రాంతాల నుంచి వలసలుగా వచ్చి ఎస్టీలుగా చలామని అవుతూ నిజమైన గిరిజనులకు అన్యాయం చేస్తున్నా రు. వారి వలసలను నిరోధించే దమ్ము, ధైర్యం అధికారులకు లేక పోగ వారు ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడే నివసిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాలు సైతం జారీ చేసిన ఘనత మన అధికారులకే దక్కుతుంది. 

గిరిజన చట్టాల అమలెక్కడా..?
నాటి నుంచి నేటి వరకూ ఆదివాసీల పరిస్థితి కడుదయనీయం.. భూమి.. నీరు.. అడవిపై ఇంకా వారికి స్వాతంత్య్రం రాలేదు. ఎక్కడున్నాయి గిరిజన హక్కులు.. హక్కులను కల్పించే అధికారులు, ప్రజాప్రతినిధులు మాముళ్ల మత్తుల్లో తలతూగుతుంటే వారికి న్యాయం కల్పించే వారెవరు.. గిరిజన చట్టాలు గిరిజనేతరులకు చుట్టాలవుతున్నాయి. వాటిని మడచి జేబుల్లో పెట్టి దర్జాగా తిరుగుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తోంది. అప్పటి నైజాం సర్కారు ఆదివాసీ భూముల రక్షణకై  భూ బదలాయింపు చట్టం 1/70 తీసుకవచ్చినా రక్షణ కల్పించే అధికార యంత్రాగం ఆదివాసీల భూములపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. గిరిజనుల భూములను గిరిజనేతరులు గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించుకుంటున్నారు. ఆదివాసీ చట్టాలు, భూ ములకు రక్షణ కల్పించకపోవడం ఎవరి తప్పుని ప్రశ్నిస్తున్నారు. 

ఓటు బ్యాంకు కోసం..
ఆదివాసీలను ఓటు బ్యాంకుగా నాయకులు ఉపయోగిస్తున్నారు. ఎన్నికలు వచ్చాయంటే స్టేజెక్కి మైకు చేత బట్టుకుని వాగ్ధానాల వర్షం కురిపించడమే నాయకుల వంతు. వారి మాటలకు మోగిస్తున్న చప్పట్లతో నాయకుని కార్యమైతే నెరవేరుతుంది. తర్వాత ‘వర్షం పోయాక..ఎండలు కొట్టిన’ చందంగా మారుతాయి గిరిజన బతుకులు. 1/70 గురించి ఎరుగని వారుండరూ కానీ నేడు ఏజెస్సీలో పుట్టగొడుగుల్లా.. మిద్దెలకు మిద్దెలు నిర్మిస్తుంటే వారించే అధికారులు కళ్లప్పగించే చూస్తున్నారే తప్ప అడ్డుకోవడం లేదు. ఎప్పటికీ అదివాసీలు అడవులకే పరిమితమా..? అధికారులు.. నాయకులు.. ఒక్కసారీ ఆలోచించండి..!! అందుకోనేమో భీం నీవు మళ్లీ పుట్టాలని గిరిజనులు కోరుకుంటున్నారు. 

భీమ్‌ వర్ధంతికి మంత్రి ఐకేరెడ్డి రాక
ఆసిఫాబాద్‌: గిరిజన పోరాట యోధుడు కుమురం భీమ్‌ వర్ధంతి కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొననున్నట్లు మంత్రి పీఏ కార్తిక్‌ రెడ్డి పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు