‘ప్రశ్నించే గొంతు కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించండి’

8 Jan, 2020 14:59 IST|Sakshi

సాక్షి, నల్గొండ: రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు కావాలంటే మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రంలో మోదీ పాట.. రాష్ట్రంలో ఓవైసీ పాట పాడుతూ ద్వంద వైఖరిని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని మైనారిటీ ముస్లింలు గ్రహించాలని కోరారు. నార్కట్‌పల్లిలోని వివేర హోటల్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ఎన్నికల నుంచే కాంగ్రెస్‌ పార్టీ విజయ పరంపర మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీని తక్కువ అంచనా వేయలేమని మంత్రి కేటీఆరే స్వయంగా ఒప్పుకున్నారని పేర్కొన్నారు. వచ్చే నాలుగు సంవత్సరాల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

చదవండి: ఎయిమ్స్‌కు నిధులివ్వండి

మరిన్ని వార్తలు