ఆర్టీసీ కార్మికుల కోసం చావడానికైనా సిద్ధం

14 Oct, 2019 20:37 IST|Sakshi

సాక్షి, చౌటుప్పల్‌: న్యాయమైన డిమాండ్‌లపై సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల కోసం చావడానికైనా తాము సిద్ధమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంకోసం సోనియా గాంధీని సైతం ఎదిరించామని పేర్కొన్నారు.

కేసీఆర్‌ దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదని, ఆయన దొంగ దీక్షలతో ఎన్నో ప్రాణాలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఆస్తులు, డిపోల స్థలాలపై కన్నేసిన కేసీఆర్‌, కార్మికులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దోపిడీలో భాగంగానే మెగా కృష్ణారెడ్డికి ఎలక్ట్రికల్‌ బస్సులు, వరంగల్‌లో ఎంపీ దయాకర్‌కు ఆర్టీసీ స్థలాల కేటాయింపు బాగోతమన్నారు. కార్మికులు ఆత్మస్థైర్యంతో ఉండాలే తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు