మరోసారి అవకాశం ఇవ్వండి : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

1 Dec, 2018 14:49 IST|Sakshi
మసీదు వద్ద ప్రచారం చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

సాక్షి, నల్లగొండ : మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని 34, 35 వార్డుల్లో ఆయన గడపగడపకూ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ నియోజకవర్గాన్ని తాను ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. ఒకప్పుడు తాగు నీరు లేక నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడేవారని, కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే పానగల్‌ నుంచి పైప్‌లైన్‌ వేయించి నీరందించామని పేర్కొన్నారు. అంతే కాకుండా అండర్‌గ్రౌండ్‌ డ్రైయినేజీ, సీసీ రోడ్లతో పాటు ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు కాంగ్రెస్‌ పాలనలోనే జరిగాయన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేండ్లలో చేసింది ఏమీ లేదన్నారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని నల్లగొండను నందనవనంగా తీర్చిదిద్దేందుకు మరో అవకాశం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సట్టు శంకర్, మల్లయ్య యాదవ్, కడారి కోటి, ఇంతియాజ్, జహంగీర్‌ పాల్గొన్నారు.
ముస్లిం పెద్దలను కలిసిన కోమటిరెడ్డి:
పాత కలెక్టరేట్‌ రోడ్డులోని మసీద్‌ వద్ద ప్రార్థనలకు వచ్చిన ముస్లింలను కోమటిరెడ్డి కలిసి తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం మైనార్టీ యువకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. పలు మసీదుల వద్దకు వెళ్లి ప్రార్థన అనంతరం బయటికి వచ్చిన తర్వాత వారిని  ఓటును అభ్యర్థించారు. 

మరిన్ని వార్తాలు...

మరిన్ని వార్తలు