16 ఎంపీ స్థానాలు గెలిచే సత్తా టీఆర్‌ఎస్‌దే..

14 Mar, 2019 18:14 IST|Sakshi
మాట్లడుతున్న మంత్రి ఈశ్వర్, పక్కన ఎంపీ వినోద్‌కుమార్‌ తదితరులు 

కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమే

ప్రతిపక్ష పార్టీలకు  డిపాజట్లు దక్కవు

కేసీఆర్‌ సభకు జనసమీకరణ కనీవినీ ఎరుగని రీతిలో ఉండాలి

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

కరీంనగర్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 16 స్థానాలు గెలువబోతుందని, కేంద్రంలో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. బుధవారం శ్వేత హోటల్‌లో కరీంనగర్‌ నియోజకవర్గస్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. ఈనెల 17న సీఎం కేసీఆర్‌ పాల్గొనే బహిరంగసభకు కనీవినీ ఎరుగని రీతిలో జనసమీకరణ చేయాలని కోరారు. రెండున్నర లక్షల మందితో పార్లమెంటరీ నియోజకవర్గస్థాయి బహిరంగసభ నిర్వహిస్తామన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి 50 వేల మందికిపైగా కార్యకర్తలను సమీకరించాలని సూచించారు.  అన్నివర్గాలు టీఆర్‌ఎస్‌ గెలుపు ఆవశ్యకత గురించి నిర్ణయానికి వచ్చాయని అన్నారు. దేశరాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలదే హవా అని, కాంగ్రెస్, బీ జేపీలు సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి అ సలే లేదని చెప్పారు. 16 సీట్లు గెలిస్తే ఢిల్లీలో టీఆ ర్‌ఎస్‌ చక్రం తిప్పే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఎంపీ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ 70 ఏళ్లల్లో చేయని అభివృద్ధి నాలుగున్నరేళ్లల్లో చేసి చూపించిన ఘనత టీఆర్‌ఎస్‌దేనన్నారు.  ఎమ్మె ల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆ ర్‌కు కరీంనగర్‌ సెంటిమెంట్‌ జిల్లా అని, మొదటి బహిరంగసభను కరీంనగర్‌ గడ్డపై నుంచే మొదలు పెట్టారని, ఐదు లక్షల పైచిలుకు మెజార్టీతో కరీంనగర్‌ ఎంపీగా వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మేయర్‌ రవీందర్‌సింగ్, ఎంపీపీ వాసాల రమేశ్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు జమీలోద్దీన్, కాశెట్టి శ్రీనివాస్, ఎడ్ల శ్రీనివాస్, తుల బాలయ్య, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, కార్యకర్తలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు