వెంటిలేటర్‌పై కాంగ్రెస్‌.. అందుకే ఒంటేరు డ్రామాలు!

26 Nov, 2018 20:33 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డి హైడ్రామాలు ఆడుతున్నారని టీఆర్‌ఎస్ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఎన్నికల సంఘం ముందు ఒంటేరు ఆడిన డ్రామాలు చూస్తుంటే.. కాంగ్రెస్‌ పార్టీ వెంటిలేటర్‌ మీద ఆధారపడినట్టు స్పష్టమవుతోందన్నారు. కొత్త ప్రభాకర్‌ రెడ్డి సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఒంటేరు తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తెలంగాణలో ఎన్నికల కోసం ఆంధ్రా నుంచి లక్షల రూపాయలు వస్తున్నాయని, ఆదివారం పట్టుబడిన డబ్బులు కూడా అందులోనివేనని అన్నారు. పట్టుబడిన డబ్బులకు టీఆర్‌ఎస్‌ చెందినవి అనడం  హాస్యాస్పదమన్నారు.

ముఖ‍్యమంత్రి కేసీఆర్‌ని ఓడించడం కోసమే కూటమి కట్టారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజాదరణ పెరగటంతో సభ్యత సంస్కారం లేకుండా బూటకపు ధర్నా చేశారని దుయ్యబట్టారు. డిసెంబర్‌ 12న టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక నర్సారెడ్డి, ప్రతాపరెడ్డి లు ఎక్కడికి పారిపోతారో తేల్చుకోవాలని ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టె  చిల్లర రాజకీయాలు చేయవద్దని అన్నారు. 

మరిన్ని వార్తలు