కొత్తపేట్‌ మార్కెట్‌కు తాళం 

12 Jul, 2020 07:14 IST|Sakshi

నేటి నుంచి బంద్‌.. రైతులు, వ్యాపారులు కోహెడకు వెళ్లాలి 

హై కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: కొత్తపేట్‌ ఫ్రూట్‌ మార్కెట్‌ను నేటి నుంచి మూసివేస్తున్నట్లు మార్కెటింగ్‌ శాఖ అధికారులు ప్రకటించారు. కరోనా ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మార్కెట్‌కు పండ్లు తెచ్చే రైతులు, కొనుగోలుకు వచ్చే వ్యాపారులు కోహెడకు వెళ్లాలని సూచించారు. అయితే కోహెడలో సరైన వసతులు లేవని, తాత్కాలిక షెడ్లు మాత్రమే ఉన్నాయని, వ్యాపార లావాదేవీలు ఎలా చేపట్టాలని రైతులు, వ్యాపారులు  ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం కూడా  కోహెడ వెళ్లాలని అధికారులు సూచించారు.

అయితే అక్కడ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయకపోవడంతో గాలివాన, భారీ వర్షానికి షెడ్లన్నీ కుప్పకూలిపోయాయి. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయకుండా కోహెడ వెళ్లాలని అధికారులు ఆదేశిస్తున్నారని,  ఇది సరికాదని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం వర్షాకాలమైనందున, అక్కడ ప్లాట్‌ఫారాలు లేకపోవడంతో పండ్లు నేల పాలవుతాయని ఆందోళ వ్యక్తం చేన్నారు. గతంలో షెడ్లు కొందరు రైతులు, వ్యాపారులు గాయపడ్డారని మళ్లీ కోహెడకు వెళ్లాలంటే భయమవుతోందంటున్నారు.  

అధికారులు కోర్టు ఆదేశాలును బేఖాతరు చేస్తున్నారు 
మూడు నెలల క్రితం ఫ్రూట్‌ మార్కెట్‌ను కోహెడకు తరలించారు. అయితే అక్కడ ఎలాంటి వసతులు లేకపోవడంతో రైతులు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో కమీషన్‌ ఏజెంట్లు హై కోర్టును ఆశ్రయించారు.  పూర్తి స్థాయిలో పక్కాగా నిర్మాణాలు చేపట్టిన అనంతరమే మార్కెట్‌ను కోహెడకు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే పూర్తి స్థాయిలో  ఏర్పాట్లు చేయకుండానే ఈ నెల 12వ తేదీ నుంచి మార్కెట్‌ను కోహెడకు తరలిస్తున్నారు. కోర్టు అదేశాలను లెక్క చేయకుండా మార్కెటింగ్‌ శాఖ వ్యవహరిస్తోందని, కోర్టు ధిక్కర చర్యగా పేర్కొంటూ మళ్లీ కోర్టును ఆశ్రయిస్తున్నట్లు కమీషన్‌ ఏజెంట్లు తెలిపారు. 

ఎక్కడైనా కరోనా ప్రబలుతుంది 
కొత్తపేట్‌ మార్కెట్‌ను మూసివేసి కోహెడకు తరలిస్తే కరోనా ప్రబలదా అని రైతులు, వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు కొత్తపేట్‌ మార్కెట్లో శానిటైజేషన్‌ ఏర్పాట్లు చేయకుండా, వ్యాధి నిరోధక విధానాలు అవలంబించకుండా కోహెడకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేస్తున్నారని మార్కెట్‌ తరలించేందుకు ఇంత తొందరపాటు వైఖరి ఎందుకు ప్రదర్శిస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. కోహెడ మార్కెట్‌ సమీపంలో ప్రజా ప్రతినిధులు, మార్కెట్‌ కమిటీ సభ్యులు, మార్కెటింగ్‌ శాఖ అధికారులు భూములు కొనుగోలు చేశారని, వీటి విలువ పెంచుకోవడానికి మార్కెట్‌ను తరలించేందుకు తొందరపెడుతున్నారని కమీషన్‌ ఏజెంట్లు అరోపిస్తున్నారు.  

మరిన్ని వార్తలు