డెంగీ.. బొప్పాయి.. కొత్తపేట మార్కెట్‌లో గొడవ

24 Sep, 2019 11:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డెంగ్యూ ఫీవర్‌ విజృంభిస్తుండటంతో దవాఖానాలు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఇక డెంగీ అటాక్‌తో తలెత్తే ప్లేట్లెట్ల సమస్యను సమర్థంగా ఎదుర్కొంటే ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు. బొప్పాయి, దానిమ్మ పండ్లను ఆహారంగా తీసుకుంటే ప్లేట్లెట్ల వృద్ధికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బొప్పాయికి భారీ గిరాకీ ఏర్పడింది. బహిరంగ మార్కెట్‌లో కిలో రూ.100 పైగా పలుకుతోంది.

మరో వైపు బొప్పాయి పంట తగినంత అందుబాటులో లేకపోవడంతో పండ్ల వ్యాపారులు దాని కోసం పోటీపడుతున్నారు. ఈ క్రమంలో కొత్తపేట పండ్ల మార్కెట్‌లో మంగళవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెమటోడ్చి పండించిన పంటకు దళారులు తక్కువ మొత్తంలో చెల్లించి.. బయట భారీ మొత్తానికి అమ్ముకుంటున్నారని రైతులు ఆరోపించారు. దళారుల రేట్లు నచ్చక నేరుగా విక్రయాలు జరిపారు. దీంతో బొప్పాయి పండ్లు తమకే అమ్మాలని రైతులపై దళారులు దాడి చేశారు. పరస్పరం దాడులతో పండ్ల మార్కెట్‌ దద్దరిల్లింది. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు.

మరిన్ని వార్తలు