నదుల్లోకి చేరే నీటిని శుభ్రపరచాలి

19 Dec, 2019 02:18 IST|Sakshi

మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా, గోదావరి జలాలు కలుషితం అవుతున్నాయని, నదుల్లోకి చేరే నీటిని శుభ్రపరచాల్సిన అవసరముందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంత పునరుజ్జీవన ప్రాజెక్టు డీపీఆర్‌ రూపకల్పన సన్నాహక సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడు తూ, గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల పరిరక్షణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. నదులకు 5 కి.మీ. దూరం నుంచి రైతుల పొలాలలో నీడనిచ్చే చెట్లు, ఉద్యాన పంటలు వంటివి వేయాలన్నారు. వాగులకు రెండు కిలోమీటర్ల పరిధిలో భారీగా పచ్చదనాన్ని పెంచాలన్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ద్వారా 25 లక్షల ఎకరాల భూమిలో పచ్చదనం వెల్లివిరుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఇండియన్‌ ఫారెస్ట్‌ బయో డైవర్సిటీ సంచాలకులు జయప్రసాద్, శాస్త్రవేత్త డీఆర్‌ఎస్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు