కృష్ణా జలాల కేసు 4 వారాలు వాయిదా

12 Feb, 2015 03:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా నదీ జలాల పునఃకేటాయింపుల కోసం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు 4 వారాల పాటు వాయిదా వేసింది. తమ రాష్ట్రం కొత్తగా ఏర్పడినందున కృష్ణా జలాల కేటాయింపులను తిరిగి జరపాలంటూ ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత డిసెంబర్ 1న ఈ కేసు జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్, జస్టిస్ ప్రఫుల్ల సి.పంత్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు రాగా..  పిటిషన్‌కు గల విచారణార్హతలపై కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం నోటీసులు జారీచేసింది.

కృష్ణానది పరిధిలోని అన్ని రాష్ట్రాలు నాలుగు వారాల్లోపు దీనిపై ప్రతిస్పందనలు తెలియజేయాల్సి ఉంటుందని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌జిత్‌సేన్, జస్టిస్ నాగప్పన్‌లతో కూడిన ధర్మాసనం వద్దకు మరోసారి విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌పై మిగతా రాష్ట్రాల నుంచి ఇంకా సమాధానాలు రాకపోవడంతో కేసును 4 వారాలపాటు వాయిదావేస్తూ.. ఈలోపు ఆయా రాష్ట్రాలు కౌంటర్లు దాఖలు చేయాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.
 

మరిన్ని వార్తలు