కృష్ణమ్మ రాకతో జలసిరి  

21 Mar, 2019 14:32 IST|Sakshi
కేఎల్‌ఐ నీటితో నిండిన కోడేరు చెరువు

కృష్ణమ్మ రాకతో  నిండిన చెరువులు 

 పచ్చని పరుపేసిన పుడమితల్లి     

సాక్షి, కోడేరు: వరుస కరువుతో కుదేలైన అన్నదాతల ఆశలు కృష్ణమ్మ పరవళ్లతో రెక్కలు విప్పుకున్నట్లయ్యింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా జొన్నలబొగుడ రెండో లిప్టు నుంచి నీరురావడంతో కోడేరు మండలంలోని గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. దీంతో మండలంలోని అన్నదాతలు పంటలను పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

అత్యధికంగా వరిసాగు 
మండలంలోని కోడేరు, పస్పుల, రాజాపూర్, ముత్తిరెడ్డిపల్లి, ఎత్తం, నాగులపల్లి, కొండ్రావుపల్లి, నర్సాయిపల్లి తదితర గ్రామాలకు కేఎల్‌ఐ కాల్వల ద్వారా సాగునీరు రావడంతో ఆరుతడి పంటలు, వరిపంటలను సాగు చేసుకున్నారు. కొన్నేళ్లుగా కరువు కాటకాలతో అల్లాడిన రైతులకు జొన్నలబొగుడ ద్వారా సాగునీరు వచ్చి చెరువులు, కుంటలు నిండటంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల్లో నీటిమట్టం పెరిగిందన్నారు. రబీలో వేసిన పంటల ద్వారా తమ అప్పులను తీర్చుకున్నామని   ఆనందం   వ్యక్తం చేస్తున్నారు.

కొందరు బోరుబావులు లేని రైతులు చెరువులు, కుంటల  వద్ద  మోటార్ల  ద్వారా  తమ   పొలాలకు  సాగునీరు అందించుకొని అధిక దిగుబడులు పొందుతున్నామని పేర్కొంటున్నారు. మత్స్యకారులు సైతం చేపలను పెంచుతూ ఆర్థికాభివృద్ధి చెందుతున్నాని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు