బీసీలను కులాల వారీగా లెక్కించాలి

27 Oct, 2019 02:35 IST|Sakshi

జనగణన– 2020పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి

కాచిగూడ: కేంద్ర ప్రభుత్వం జరిపే జనగణన 2020లో కులాల వారీగా బీసీలను లెక్కించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు. ఈమేరకు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం శనివారం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్‌రెడ్డిని కలసి వినతి పత్రం సమర్పించింది. అనంతరం ఆర్‌.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణలు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం సంవత్సరం క్రితం బీసీ కులాల వారీగా లెక్కలు సేకరించాలని హోంశాఖ మంత్రివర్గ కోర్‌కమిటీ సమావేశం నిర్ణయించిందని, ఆ తర్వా త సర్క్యులర్‌ కూడా జారీ చేసిందన్నారు. ఇటీవల కేంద్రం హోంశాఖ ద్వారా జారీ చేసిన నమూనా పత్రంలో ఎస్సీ/ఎస్టీల వివరాలు కాలం, హిందూ, ముస్లిం, క్రైస్తవ తదితర మతాల కాలమ్స్‌ వివరాలు, ఇతర వివరాలకు సంబంధించిన కాలమ్స్‌ నమూనా పత్రాన్ని జారీ చేశారని తెలి పారు. కానీ ఈ జనాభా లెక్కల బీసీ కులాల వివరాలకు సంబంధించినవి పెట్టలేదని వివరించారు. 

మరిన్ని వార్తలు