వరంగల్‌ నిట్‌లో కృష్ణమాచారి ఆసక్తికర వ్యాఖ్యలు

14 Oct, 2017 13:17 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు చాలా బాగుంటున్నాయని.. అందువల్లే అభివ​ద్ధిలో తెలంగాణ దేశంలో తొలిస్థానంలో ఉందని మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ అన్నారు. వరంగల్ నిట్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ.. 'నేను తమిళనాడు వాడినే అయినా అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉంది. విద్యార్థులు విరాట్ కోహ్లి, ఎంఎస్‌ ధోనీలా ఎదగాలంటే లక్ష్యం కోసం కష్టపడాలి' అని సూచించారు.

కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ అంటూ కొనియాడారు. ఆయన కెప్టెన్సీలో కచ్చితంగా విజయం సాధిస్తారని అన్నారు. యువతకు కార్పొరేట్‌ వ్యవహారాలపై శిక్షణ ఇచ్చేందుకు 'కెరీర్‌ స్ట్రోక్స్‌' కంపెనీని ఏర్పాటుచేసిన కృష్ణమాచారి శ్రీకాంత్‌. టాస్క్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు దేశంలోనే అగ్రగామి నిలువబోతోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • బడ్జెట్ లో నేరుగా కార్పోరేషన్ లకు నిధులిచ్చే ఆనవాయితీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది
  • ఇతర రాష్ట్రాలలో ఉన్న టెక్స్ టైల్ రంగం కార్మికులకు రెండింతల పని, వేతనంతో ఉన్న సొంతూళ్లోనే ఉద్యోగాలు కల్పిస్తాం
  • అపార అనుభవం గల స్కిల్డ్ లేబర్ అందర్నీ రప్పిస్తాం
  • ఫాం టూ ఫ్యాషన్ సూత్రంతో టెక్స్ టైల్ పరిశ్రమ ఏర్పాటు
  • దేశంలోని వివిధ ప్రాంతాలలో లభించే అన్ని రకాల వస్ర్తాలు ఇక ఒకేచోట తయారీ
  • వికేంద్రీకరణ లో భాగంగా వరంగల్ మరో ఆర్థిక రాజధాని
  • దేశంలోనే నాణ్యమైన పత్తి ఉత్తర తెలంగాణ లో పండుతుందని పరిశోధనలో తేలింది
  • టెక్స్ టైల్ పార్కు తోపాటు పారిశ్రామిక వాడ ఏర్పాటుతో వరంగల్ నగర విస్తరణ
  • హైదరాబాద్ నుండి వరంగల్ వరకు ఇండస్ట్రీయల్ కారిడార్‌
  • రూ.667 కోట్లతో టెక్స్ టైల్ మొదటి దశ పనులు.. 1.20 లక్షల మందికి ఉపాధి
  • టెక్స్ టైల్ కళాశాల స్థాపనకు కోయంబత్తూరు కలశాలతో ఎంఓయూ
  • ఈ నెల 22న 12 కంపెనీలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు
  • ఎన్నికల స్టంట్‌లా కాకుండా ఏడాదిలోగా పనులు పూర్తవుతాయి
  • జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం
  • ఫ్యాషన్ రంగంలో నిఫ్ట్ తోనూ సంప్రదింపులు  జరుపుతాం

మరిన్ని వార్తలు