లాజిస్టిక్‌ హబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

11 Oct, 2019 15:24 IST|Sakshi

హైదరాబాద్‌ : ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లిలో శుక్రవారం రోజున లాజిస్టిక్‌ హబ్‌ (వస్తు నిల్వ కేంద్రం)ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దాదాపు 60 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో కమర్షియల్‌ ఆపరేషన్‌ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. 'ఇబ్రహీంపట్నం ప్రస్తుతం అభివృద్ధి దిశగా దూసుకుపోతున్నది. హైదరాబాద్ శివారులో విస్తరించడం, ఔటర్ రింగ్‌రోడ్, అనేక కార్పొరేట్ కంపెనీలు ఇక్కడే ఇక్కడే ఏర్పడుతుండడంతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో శరవేగంగా విస్తరిస్తున్నది. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో దేశంలో మొదటి పార్క్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నాం. త్వరలోనే బాట సింగారంలో మరో లాజిస్టిక్ పార్క్ ప్రారంభం కానుంది. ఎలిమినేడులో ఏరో స్పేస్ ప్రాజెక్ట్ రానుంది.

వ్యవసాయ ప్రాంతాలకు పాలమూరు రంగారెడ్డి ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాగు నీటిని అందిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే ఎనిమిది సార్లు పర్యటించాను. నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషణ్‌ రెడ్డి అని ఎమ్మెల్యేని పొగడ్తలతో ముంచెత్తారు. కుంట్లూర్‌లో ఎస్టీపీ నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తున్నాం. ముచ్చర్లలో ఫార్మా క్లస్టర్ రానుంది. ఫార్మా క్లస్టర్ ద్వారా ఎన్నో ఉద్యోగాలు రానున్నాయి. ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఎన్నో పరిశ్రమలు స్థాపించవచ్చు. మరో ఎనిమిది లాజిస్టిక్ పార్క్ లను నిర్మించనున్నాము. రెండు రైల్వే టర్మినల్స్ వస్తున్నాయి. వాటిని అనుసందానం చేసుకోని పరిశ్రమలు స్థాపించాలి. లాజిస్టిక్ పార్క్‌ల స్థాపనకు మన నగరం అగ్ర భాగంలో ఉంది. మనందరం కోరుకునేది అభివృద్ధి కనుక కొత్త పరిశ్రమలు మన ప్రాంతానికి వచ్చినపుడు మనందరం స్వాగతించాలని' కేటీఆర్‌ అన్నారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. పీపీపీ మోడ్‌లో నిర్మించిన మొదటి లాజిస్టిక్ పార్క్ ఇది. జిల్లాలోని మున్సిపాలిటీలకు మరిన్ని నిధులివ్వాలని మంత్రి కేటీఆర్‌ని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ  ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. లాజిస్టిక్‌ పార్క్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో ఉన్న ఒక్కో మునిసిపాలిటీకి రూ. పది కోట్లు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ని కోరారు. పరిశ్రమలు స్థాపించడానికి ఇక్కడ అనువైన స్థలాలు ఉన్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మెన్‌ అనితా రెడ్డి , ఎండీ ఆంకాన్‌ మాట్లాడుతూ.. జిల్లా వాతావరణం చాలా బాగుంటుంది. లాజిస్టిక్‌ పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన స్పూర్తితో తక్కువ కాలంలోనే పూర్తిచేయనున్నట్లు తెలిపారు. ఇందులో ట్రక్‌ డ్రైవర్ల పాత్ర ఎంతో కీలకమన్నారు.  ఈ లాజిస్టిక్‌ పార్క్‌ల ఏర్పాటువల్ల ఇంకా అనేక కంపెనీలు ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయన్నారు.  
 

మరిన్ని వార్తలు