కేటీఆర్‌కు అరుదైన గౌరవం 

31 May, 2019 02:39 IST|Sakshi

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆహ్వానం 

అక్టోబర్‌ 3, 4 తేదీల్లో భేటీలు 

 ఢిల్లీలో నిర్వహణ

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావుకు అరుదైన గౌరవం దక్కింది. ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ఆన్‌ ఇండియా’పేరుతో నిర్వహించే సమావేశానికి గౌరవ అతిథిగా హాజరు కావాలని ఆ ఫోరం కేటీఆర్‌ను కోరింది. సీఐఐ భాగస్వామ్యంతో ఈ ఏడాది అక్టోబర్‌ 3, 4 తేదీల్లో ఢిల్లీలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఫోరం తెలిపింది. మూడు దశాబ్దాలుగా ఇండియా ఎకనామిక్‌ సమ్మిట్‌ పేరుతో నిర్వహిస్తున్న సదస్సులకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశం జరగనున్నట్లు తెలిపింది. ‘మేకింగ్‌ టెక్నాలజీ వర్క్స్‌ ఫర్‌ ఆల్‌’అనే థీమ్‌తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఫోరం తన ఆహ్వానంలో పేర్కొంది.

ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్‌ ఒకటని, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ సరైన అభివృద్ధిని నమోదు చేసిందని ఫోరం తెలిపింది. భారత్‌ సైతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రపంచం సైతం భారత్‌లో ఉన్న అవకాశాలపై అవగాహన చేసుకోవలసిన అవసరమున్న నేపథ్యంలో ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉందని వెల్లడించింది. భారత్‌లోని ఆదర్శవంతమైన కార్యక్రమాలపై చర్చించడానికి ముఖ్యమైన వక్తలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు దీనికి హాజరవుతారని వివరించింది. కేటీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ అనేక రంగాల్లో ముందంజ వేసిన విషయాన్ని ఫోరం ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేటీఆర్‌ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణలో ఇన్నోవేషన్, టెక్నాలజీ రంగాల్లో వినూత్న కార్యక్రమాలను చేపట్టి దేశం దృష్టిని ఆకర్షించిందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఈ సమావేశానికి హాజరై తన అనుభవాలను పంచుకోవాలి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కోరింది. 

మరిన్ని వార్తలు