కేటీఆర్‌ కుమారుడికి గోల్డ్‌ మెడల్‌

1 Mar, 2019 07:42 IST|Sakshi

హైదరాబాద్‌: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ సంస్థ నిర్వహించిన బెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌ పర్యావరణ విభాగంలో హైదరాబాద్‌ ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ విద్యార్థి బంగారు పతకం సాధించాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు వ్యక్తిగత విభాగంలో 29,482 కిలోల రీసైకిలబుల్‌ వేస్ట్‌ సేకరించి అగ్రస్థానంలో నిలిచాడు. పాఠశాల విభాగంలోనూ ఖాజాగూడలోని ఓక్రిడ్జ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ 34,137 కిలోల రీసైకిలబుల్‌ వేస్ట్‌ను సేకరించి మూడో స్థానంలో నిలిచింది. 

బెహతర్‌ ఇండియా క్యాంపెయిన్‌ గ్రాండ్‌ ఫినాలే సందర్భంగా గురువారం ఢిల్లీలో క్యాంపెయిన్‌ బ్రాండ్‌ అంబాసిడర్, సినీ నటి పరిణితీ చోప్రా చేతుల మీదుగా పతకాలను ప్రదానం చేశారు. ఓక్రిడ్జ్‌ పాఠశాల యాజమాన్యాన్ని, వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన హిమాన్షును డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమెరికా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఎండీ అనూప్‌ పెబ్బీ అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ అర్జున్‌రావు మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఓక్రిడ్జ్‌ పాఠశాలకు బెహతర్‌ ఇండియా కార్యక్రమంలో రెండు పతకాలు రావడం సంతోషంగా ఉందన్నారు.  

మరిన్ని వార్తలు