హైదరాబాద్‌లో వరల్డ్‌ క్లాస్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీ: కేటీఆర్‌

18 Dec, 2019 11:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా కంపెనీలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణలో యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు యూఎస్‌-ఇండియా డిఫెన్స్‌ ఒప్పందాలపై సదస్సు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం సదస్సును ఉద్దేశిస్తూ.. ఆయన ప్రసంగించారు. 'టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఐదేళ్లలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. అమెజాన్‌ వంటి పెద్ద సంస్థలు హైదరాబాద్‌కు వచ్చాయి. తెలంగాణ డిఫెన్స్‌ హబ్‌గా మారుతుంది. 12కు పైగా డిఫెన్స్‌ సంస్థలు హైదరాబాద్‌లో ఉన్నాయి. 25 ఏరోస్పేస్‌ సంస్థలు హైదరాబాద్‌లో పనిచేస్తున్నాయి. బోయింగ్‌ లాంటి సంస్థలు నగరంలో ఉన్నాయి. ఆదిబట్లలో ప్రత్యేకంగా ఏరోస్పేస్‌ పార్క్‌ ఏర్పాటు చేశాం. తెలంగాణ ఆకాడమీ ఆఫ్‌ స్కిల్స్‌ ద్వారా ప్రత్యేక శిక్షణలు ఇస్తున్నాం. వరల్డ్‌ క్లాస్‌ డిఫెన్స్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ తక్కువ ధరకే వస్తువును ఉత్పత్తి చేయవచ్చు. టీహబ్‌ భారత్‌లోనే అతిపెద్ద స్టార్టప్‌ హబ్‌. హార్డ్‌వేర్‌ స్టార్టప్‌కు ప్రోత్సాహం అందిస్తున్నామని' మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు