నేడే ప్రారంభం

4 Nov, 2019 11:29 IST|Sakshi
బయోడైవర్సిటీ పార్కు వద్ద ప్రారంభానికి సిద్ధమైన ఫ్లై ఓవర్‌

ఐటీజోన్‌లో జెయింట్‌ ఫ్లైఓవర్‌  

ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

గచ్చిబౌలి: నిత్యం ట్రాఫిక్‌తో రద్దీగా ఉండే ఐటీ కారిడార్‌లో మరో ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రానుంది. బయోడైవర్సిటీ డబుల్‌ హైట్‌ ఫ్లైఓవర్‌ను సోమవారం ప్రారంభించనున్నారు. దీంతో రాయదుర్గం నుంచి హైటెక్‌సిటీ, ఇనార్బిట్‌ మాల్‌ వైపు వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ప్రయాణం చేయవచ్చు. రెండున్నర ఏళ్లకు ముందు ప్రారంభమైన నిర్మాణానికి స్థల సేకరణ అడ్డంకిగా మారడంతో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు నిర్మాణ పనులు పూర్తి కావడంతో అతి ఎత్తయిన వంతెన అందుబాటులోకి వచ్చింది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. బల్దియా పరిధిలో ఎస్‌ఆర్‌డీపీ పనుల కింద చేపట్టిన ఫ్లైఓవర్లలో ఈ డబుల్‌ ఫ్లైఓవర్‌ నగరంలోనే ఎత్తయినది. దాదాపు రూ.16.47 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ వంతెన జంక్షన్‌లో ఎత్తు 17.45 మీ. కాగా, పొడవు 990 మీ, వెడల్పు 11.5 మీటర్లు. మూడు లైన్ల వెడల్పులో వన్‌ వేలో వెళ్లాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు