ముందస్తు  అభ్యర్థులు

6 Sep, 2018 11:17 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నట్లుగానే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ అభ్యర్థిత్వాలపై ముందస్తుగా స్పష్టత వస్తోంది. ఈసారి ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గంపగోవర్ధన్‌ మరో సారి బరిలో ఉంటారని మంత్రి కేటీఆర్‌ మంగళవారం తెలంగాణ భవన్‌లో ప్రకటించారు. దీంతో గంప అనుచరవర్గంలో ఉత్సాహం నింపినట్లయ్యింది. మరోవైపు బాన్సువాడ నియోజకవర్గం నుంచి తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించుకున్నా రు.

ఈ ఎన్నికల్లో తన ముగ్గురు కుమారుల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారనే ప్రచా రానికి తెరదించుతూ తానే బరిలో ఉంటా నని స్పష్టం చేశారు. నిజామాబాద్‌ పార్ల మెంట్‌ స్థానం పరి«ధిలోకి వచ్చే జగిత్యాల నియోజకవర్గం టిక్కెట్టును కూడా ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ ఎన్నికల్లో సంజయ్‌కుమార్‌ గెలుపు ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల దిశగా వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో టిక్కెట్ల ప్రకటనలు ఆ పార్టీ వర్గాల్లో జోష్‌ను నింపుతున్నాయి. మరోవైపు ఆయా స్థానాల నుంచి టిక్కెట్టు ఆశిస్తున్న ఆశావహులకు నిరాశే ఎదురవుతోంది.

సెప్టెంబర్‌లోనే మొదటి లిస్టు.. 
సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని అధినేత కేసీఆర్‌ పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చారు. ఎమ్మెల్యేల పనితీరుపై నెలవారీగా సర్వేలు చేయించిన కేసీఆర్‌ ఆయా ఎమ్మెల్యేల పనితీరును ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్‌లోనే అభ్యర్థులను ప్రకటిస్తామని సీఎం కేసీఆర్‌ స్పష్టత ఇచ్చారు. కాగా మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో నాలుగు లేదా ఐదు నియో జకవర్గాలకు మొదటి జాబితాలో చోటు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. అధినేత ప్రకటించినట్లుగానే ఈ నెలలోనే జాబితాను ప్రకటించే అవకాశాలున్నాయి. అయితే ముం దస్తుగానే అభ్యర్థుల విషయంలో స్పష్టత వస్తుండటం గమనార్హం. అధినేత కేసీఆర్‌ ప్రకటించే జాబితాలో పేర్లు ఉంటేనే ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్‌ ప్రకటించి ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

గత ఎన్నికల్లో తొలి అభ్యర్థిత్వం జిల్లా నుంచే.. 
2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పో టీ చేసే అభ్యర్థుల ప్రకటనను సీఎం కేసీఆర్‌ జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోనే తొలి అభ్యర్థిత్వాన్ని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌రెడ్డి పేరును ప్రకటించారు. ఆదిలాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన కేసీఆర్‌ ఆర్మూర్‌లో జీవన్‌రెడ్డి నివాసంలో ఆగి ఈ మేరకు ప్రకటన చేశారు. ఈసారి కూడా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కామారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలు ఖరారు కావడం గమనార్హం.

>
మరిన్ని వార్తలు