భూసేకరణ నిలిపివేత

9 Jun, 2018 02:22 IST|Sakshi

సిద్దిపేట జిల్లాలో భూసేకరణకు నాలుగు వారాలు బ్రేక్‌

సాక్షి, హైదరాబాద్‌: కాశేశ్వరం ప్రాజెక్టులో భాగమైన రంగనాయక్‌ సాగర్‌ కోసం సిద్దిపేట జిల్లాలోని మూడు గ్రామాల్లో భూసేకరణను నాలుగు వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణకు ముందు చేతివృత్తులు, రైతు కూలీలకు పునరావాసం, ఉపాధి కల్పన వంటి చర్యలు తీసుకోవా లని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

సిద్దిపేట జిల్లా ఇమామాబాద్, పెద్దకోడూరు, చాడ్లాపూర్‌ వంటి గ్రామాల్లో చేతివృత్తుల వారికి పునరావాసం కల్పించాకే భూసేకరణ చేయాలని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎమ్మెస్‌ రామచందర్‌రావు శుక్రవారం మధ్యంతర ఆదేశాలిచ్చారు. పునరావాస చర్యలు తీసుకోలేదంటూ విశ్వనాథం భీమాచారి మరో ఏడుగురు వేసిన వ్యాజ్యం తరఫున న్యాయవాది బి.రచనారెడ్డి వాదిస్తూ.. జీవో 123 ప్రకారం ప్రాజెక్టుకు అవసరమైన భూముల్ని రైతుల నుంచి కొనుగోలు చేసిందని, అయితే ఆ భూములపై ఆధారపడిన వారికి పునరావాస చర్యలు తీసుకోలేదన్నారు.

భూమిని స్వాధీనం చేసుకున్నామే గానీ ఆ భూమి నుంచి ఎవరినీ ఖాళీ చేయించలే దని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచందర్‌రావు చెప్పారు. ఇరు వర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి.. ఉపాధి, పునరావాస చర్యలు తీసుకోకుండా భూ స్వాధీనానికి వీల్లేదని, అం దుకే నాలుగు వారాలపాటు భూసేకరణను నిలిపివేస్తున్నామని, ఈలోగా పునరావాస చర్యలు తీసుకుని ప్రభుత్వ వాదనలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు