అతిపెద్ద సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ 

12 Dec, 2019 03:29 IST|Sakshi

ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో ఏర్పాటు

బంజారాహిల్స్‌: రాష్ట్రంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ప్లాంట్‌ను జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ)లో నెలకొల్పారు. 2018లో 500 కిలో వాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఈ సంస్థ తాజాగా 350 కిలోవాట్ల సామర్థ్యం గల మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో రెండు కలిపి రాష్ట్రంలోనే అతిపెద్ద సోలార్‌ ప్లాంట్‌గా నిలిచాయి. ఈ ప్లాంట్లు నెలకు రూ.9 లక్షల విద్యుత్‌ బిల్లులను ఆదా చేస్తున్నాయి. మొత్తంగా రూ.3.81 కోట్లు వెచ్చించి ప్లాంట్లు నెలకొల్పగా రూ.95 లక్షల (25 శాతం)ను జాతీయ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ రీయింబర్స్‌ చేసింది.

త్వరలో మరో 150 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 1,000 కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌గా మార్చనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. రూఫ్‌టాప్‌ సోలార్‌ నెట్‌ మీటరింగ్‌లో భాగంగా భవనాలపైగల సోలార్‌ ప్లాంట్‌ ను డిస్కం గ్రిడ్‌కు కనెక్షన్‌ ఇస్తారు. ఎవరి భవనాల పై ఉత్పత్తయిన విద్యుత్‌ను వారు వాడుకోవడానికి ఆస్కారం ఉండగా మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించాల్సి ఉంటుంది. సోలార్‌ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తాయి. ఇలా డిస్కంలు యూనిట్‌కు రూ.4.08 చొప్పున చెల్లిస్తాయి.  

మరిన్ని వార్తలు