రాజన్న చిరునామా.. చేవెళ్ల

8 Jul, 2019 13:51 IST|Sakshi
చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్న వైఎస్సార్‌ (ఫైల్‌)

మహానేత హయాంలో రంగారెడ్డి జిల్లాకు అంతర్జాతీయ ఖ్యాతి

పరిశ్రమలు, ఐటీ సంస్థలకు పెద్దపీట

వైఎస్సార్‌ నడయాడిన నేల ఇప్పుడు అభివృద్ధి పరవళ్లు

సాక్షి, చేవెళ్ల: ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా.. అధికారంలో ఉన్నా రంగారెడ్డి జిల్లా అంటే డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఎంతో అభిమానం. ఈ ప్రాంతం ఆయనతో ఓ బంధం పెనవేసుకుంది. చేవెళ్ల నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, ఔఆర్‌ఆర్‌ నిర్మాణం, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు సహకారంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఈ జిల్లాలోనే అధికంగా అమలయ్యాయి. రంగారెడ్డి జిల్లాపై రాజన్న ముద్ర చెరపలేనిది. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. 

పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే వైఎస్సార్‌కు చేవెళ్ల ప్రాంతమంటే అమితాభిమానం. చేవెళ్ల నియోజకవర్గంతో ఆయనకు పెనవేసుకున్న బంధం ఏర్పడింది. పేదలు, రైతుల శ్రేయస్సే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ ఘంటాపథంగా ప్రకటిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 2004 ఎన్నికల్లో సీఎం పదవిని అధిష్టించిన అనంతరం వైఎస్సార్‌ వెనుతిరిగి చూడకుండా పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా పథకాలను ప్రవేశపెట్టారు. దాంతో వారు ఊహించిన దానికంటే ఎక్కువగా మేలు జరిగింది.

వైఎస్‌ రాజశేఖరరెడ్డికి సెంటిమెంట్‌గా చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఏ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించినా చేవెళ్ల నుంచే ప్రారంభించే సెంటిమెంట్‌ వైఎస్సార్‌కు ఉంది. 2001లో మండల పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచార సభకు ప్రతిపక్ష నేతగా చేవెళ్లకు వచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నడూ చేవెళ్లను మరువలేదు. చేవెళ్ల ప్రాంతం తన సెంటిమెంట్‌ అంటూ బహిరంగంగానే ఆయన పలుసార్లు ప్రకటించారు. 2003లో చేవెళ్ల నుంచి మహా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. తెలంగాణ ప్రాంతంలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు (నేటి కాళేశ్వరం ప్రాజెక్టు)కు నవంబర్‌ 19, 2008లో శంకుస్థాపన చేశారు. 2009 ఏప్రిల్‌లోఎన్నికల ప్రచారాన్ని చేవెళ్ల నుంచే ప్రారంభించి రెండోసారి విజయధుందుబి మోగించారు.  

పాదయాత్రలో వెన్నంటే.. 
2004లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖరరెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పూర్తిస్థాయిలో ప్రసన్నకుమార్‌ పాల్గొని మనన్నలు పొందారు. 2005లో రాజీవ్‌ పల్లె బాట కార్యక్రమంలో భాగంగా మంచాలకు వైఎస్సార్‌ వచ్చారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తల మధ్య వీరిని రాజశేఖరరెడ్డి పేరు పెట్టి పిలవడం విశేషం.

మంచాల మండలానికి వైఎస్సార్‌ ప్రత్యేకంగా 500 ఇళ్లు మంజూరు చేశారు. ఇళ్లతో పాటు అర్హులైన వారందరికీ పింఛన్లు కూడా అందజేశారు. ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఎంతోమందికి గుండె శస్త్ర చికిత్సలు కూడా చేయించారు. 2005 జనవరి 13వ తేదీన ఇబ్రహీంపట్నంలో పర్యటించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి  ఫ్లోరైడ్‌ పీడిత గ్రామాలకు కృష్ణ నుంచి తాగునీరు అందించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేశారు. 2008లో రెండో విడుతగా మరో రూ.12 కోట్లు కేటాయించారు. 

రావిర్యాలకు రాజన్నయోగం 
మహేశ్వరం: ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయం.. చుట్టూ ఔటర్‌ రింగురోడ్డు.. పరిసర ప్రాంతాల్లో అనేక అంతర్జాయతీస్థాయి కంపెనీలు.. వీటన్నింటి మధ్య ఉన్న రావిర్యాల గ్రామం అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్నది. ఇటు అభివృద్ధికి, అటు రియల్‌ బూమ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన రావిర్యాల ఒకప్పుడు కుగ్రామం. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పడిన అభివృద్ధి బీజాలు, ఆయన  చూపిన ప్రత్యేక చొరవతో రావి ర్యాల గ్రామం ప్రస్తుతం ప్రపంచపటంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది. అప్పట్లో వైఎస్సార్‌ చేసిన కృషిని ఆ గ్రామం స్మరించుకుంటోంది. రావిర్యాల శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. చుట్టూ ఔటర్‌ రింగురోడ్డు, పక్కనే శ్రీశైలం జాతీయ రహదారి ఉండడం, అనేక అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలు వెలుస్తుండడం, రియల్‌ బూమ్‌ భారీస్థాయిలో ఉండడంతో రావిర్యాల గ్రామానికి వరంగా మారింది. ఒకప్పుడు మారుమూల కుగ్రామంగా ఉన్న రావిర్యాల ఇప్పుడు వెలుగుతోంది.

2004లో ఈ గ్రామానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకావడంతో క్రమంగా రావిర్యాల అభివృద్ధి పథంలోకి వచ్చింది. ఎయిర్‌పోర్టు రావడం, గ్రామానికి అనుకొని ఔటర్‌ రింగురోడ్డు వెళ్లడంతో ఈ గ్రామానికి మహర్దశ పట్టింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రావిర్యాల గ్రామంలోనూ, పరిసర ప్రాంతాల్లో అనేక ప్రముఖ కంపెనీలు ఏర్పాటయ్యాయి. సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రావిర్యాల రెవెన్యూ పరిధిలో శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన హార్డ్‌వేర్‌ పార్కు, ఫ్యాబ్‌ సిటీ, టీసీఎస్, రాజీవ్‌ జేమ్స్‌ పార్కు (డైమండ్‌ పార్కు), ఆగాఖాన్‌ అంతర్జాతీయ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటుచేశారు. దీనికితోడు గ్రామాన్ని చుట్టుకొని ఔటర్‌ రింగురోడ్డు రావడంతో రావిర్యాలకు రియల్‌ బూమ్‌ వరంగా మారింది. ఒక్కసారిగా భూములకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు రావిర్యాల గ్రామం అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఇక్కడ భూమి ఎకరానికి రూ.3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు పలుకుతోంది. గ్రామం చుట్టు భారీ పరిశ్రమలు, కంపెనీలు వచ్చాయి.  

వైఎస్సార్‌ పాలనలో కొత్త వెలుగులు 
2004లో వైఎస్సార్‌ అధికారం చేపట్టిన తర్వాత నగర శివారులోని రావిర్యాలతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు కొత్త వెలుగులు వచ్చాయి. సమీపంలోని శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, ఆ వెంటనే 2005–06 సమయంలో రావిర్యాల రెవెన్యూ పరిధిలో హార్డ్‌వేర్‌ పార్కు, ఫ్యాబ్‌సిటీ, ఇంటర్‌నేషనల్‌  ఆగాఖాన్‌ అకాడమీ, రాజీవ్‌ జేమ్స్‌ పార్కు వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వెలువడం, హైదరాబాద్‌ నగరానికి మణిహారమైన ఔటర్‌ రింగురోడ్డు గ్రామానికి ఆనుకొని రావడంతో గ్రామం అభివృద్ధి వేగం పూంజుకుంది. కొత్త ఉపాధి అవకాశాలు లభించాయి. గ్రామం నుంచి ఉన్నత చదువులు చదివేవారి సంఖ్య పెరిగింది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో భారీ స్థాయిలో  కానిస్టేబుల్,ఉపాధ్యాయుల ఉద్యోగాలు పెద్దసంఖ్యలో గ్రామస్తులకు లభించాయి. రియల్‌ బూమ్‌ ఆసరాతో పలువురు గ్రామ విద్యార్ధులు  ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు.  

నాటి బీజాలే..
దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శివారు ప్రాంతంలో అభివృద్ధికి చూపిన చొరవ వల్లే ఇక్కడ ప్రస్తుతం పెద్దఎత్తున అభివృద్ధి జరుగడానికి మూలకారణమని ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్‌ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు వల్లే ఇప్పుడు గ్రామంలో ప్రగతి వెలుగులు పరుచుకున్నాయని, రావిర్యాల గ్రామం ప్రపంచపటంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేస్థాయిలో ఎదిగిందని వారు వైఎస్‌ కృషిని స్మరించుకుంటున్నారు. రాజశేఖర్‌రెడ్డి హాయంలో గ్రామానికి భారీ ప్రాజెక్టులు తీసుకురావడం, కంపెనీలు స్థాపించడం, ప్రధానంగా ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణం చేయడం మూలంగానే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందని ఆయన జయంతి సందర్భంగా వైఎస్సార్‌ అభిమానులు స్మరించుకుంటు  నివాళులు అర్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు