జగన్‌పై హత్యాయత్నాన్ని ఖండిస్తూ న్యాయవాదుల ర్యాలీ

27 Oct, 2018 04:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఉమ్మడి హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో శుక్రవారం భోజన విరామ సమయంలో నిర్వహించిన ఈ ర్యాలీలో న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బార్‌ కౌన్సిల్‌ గేట్‌ నుంచి హైకోర్టు ప్రధాన ప్రవేశద్వారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జగన్‌పై హత్యాయత్నానికి చంద్రబాబు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

చంద్రబాబు ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌కే ప్రభుత్వం భద్రత కల్పించలేని దుస్థితిలో ఉందంటూ న్యాయవాదులు నినాదాలు చేశారు. జగన్‌ను లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నానికి పాల్పడితే చంద్రబాబు రాజకీయం చేస్తూ మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హత్యాయత్నం చేసిన శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ వీరాభిమాని అని చెప్పి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రచారం కోసమే కత్తితో దాడి చేశారని సాక్షాత్తు డీజీపీ ప్రకటించడాన్ని బట్టి ఏపీలో పాలన ఏవిధంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. 

మరిన్ని వార్తలు