రైతును రాజుగా చూడాలి

13 May, 2018 08:02 IST|Sakshi
చొక్కంపేట గ్రామంలో రైతుకు చెక్కు పంపిణీ చేస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి

రాజాపూర్‌(జడ్చర్ల) : రైతును రాజుగా చూడాలన్న లక్ష్యంతో దేశంలో ఎవరూ చేయని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని దొన్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చొక్కంపేట గ్రామంలో రైతు బంధు పథకం చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ఆయన ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు భరోసా ఇస్తున్నది. రాజాపూర్‌ మండలం రైతులకు రూ.8కోట్ల పెట్టుబడి సాయం అందుతోందని తెలిపారు. రైతులు, వ్యవసాయాన్ని గత పాలకులు పట్టిం చుకోకపోగా.. తాము అధికారంలోకి వచ్చిన మొ దటి సంవత్సరంలోనే కోతలు లేని విద్యుత్, వ్యవసాయానికి పగలే నాణ్యమైన కరెంట ఇస్తున్నా మని తెలిపారు. వలసల జిల్లాగా పేరున్న పాలమూరు జిల్లా రైతాంగం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలమూరు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తే పనిలేని ప్రతిపక్ష నాయకులు కోర్టుల్లో కేసు లు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ఏది ఏమైనా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్‌ గిరిధర్‌రెడ్డి పెట్టుబడి సాయంగా అందిన రూ.2లక్షల చెక్కును మంత్రి చేతుల మీదుగా ప్రభుత్వానికి అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ నర్సింగరావు, ఎంపీటీ సీ లక్ష్మయ్య, మాజీ సర్పంచ్‌ గిరిధర్‌రెడ్డి, డీఎస్‌ఓ శారదా ప్రియదర్శిని, జేడి నిర్మల, ఏఓ నరేందర్, జడ్చర్ల మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శ్రీశైలం యాదవ్‌తో పాటు వాల్యానాయక్, లక్ష్మణ్‌ నాయ క్, అభిమన్యురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గాయపడిన రైతుకు ఇంటి వద్దే పంపిణీ  

బాలానగర్‌(జడ్చర్ల) : రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగి చికిత్స పొందుతూ నడవలేని స్థితిలో ఉన్న గుండేడ్‌ గ్రామ రైతు జంగయ్యకు ఇంటి వద్దే మంత్రి లక్ష్మారెడ్డి పెట్టుబడి సాయం చెక్కు అందజేశారు. జంగయ్య కాలిలో రాడ్లు వేయడంతో లేవలేని స్థితిలోనే ఉన్నాడని తెలుసుకున్న మంత్రి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి చెక్కు ఇచ్చి పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి వాల్య నాయక్, మార్కెట్‌ డైరెక్టర్‌ర వెంకట్‌ నాయక్, వైస్‌ ఎంపీపీ లింగునాయక్‌తో పాటు చెన్నారెడ్డి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు