జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కసిగా పోరాడుతాం

25 Jan, 2020 20:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో  కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా వికసించకపోయినా... విస్తరణకు దోహదపడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె. లక్ష్మణ్‌ అన్నారు. మున్సిపల్‌ ఫలితాల అనంతరం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా.. ఒంటరిగా బీజేపీ గణనీయమైన సీట్లు దక్కించుకుందని తెలిపారు. అధికార పార్టీ అనేక అక్రమాలతో పాటు ధన ప్రవాహాన్ని పారించిందని ఆరోపించారు. 3 మున్సిపాలిటీల్లో ఒంటరిగా గెలిచామని, కొన్ని చోట్ల ఎక్కువ స్థానాలు గెలిచామన్నారు. టీఆర్‌ఎస్‌కు 30 చోట్ల మెజారిటీ దక్కలేదని, కేటీఆర్ ఇలాకాలో బీజేపీ నాలుగు స్థానాలు గెలిచిందని తెలిపారు. 120 మున్సిపాలిటీల్లో నాలుగైదు చోట్ల మినహా అన్ని చోట్ల బీజేపీకి ప్రాతినిధ్యం లభించిందని అన్నారు. (మున్సిపల్ ఫలితాలు: క్యాంప్‌లకు తరలింపు )

అదే విధంగా బీజేపీ ఎక్కడ ఉందంటున్న కేటీఆర్‌ను సిరిసిల్లకు పోయి చూడాలంటూ చురకలంటించారు. ఈ ఫలితాలను ఆదర్శంగా తీసుకుని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మరింత కసిగా పోరాడుతామని పేర్కొన్నారు. రెబల్‌గా పోటీ చేసిన వారిపై చర్యలు తీసుకోని అసమర్థ నాయకత్వం టీఆరెస్‌ది అని విమర్శించారు. విజయంపై టీఆర్‌ఎస్‌కు అంత నమ్మకం అంటే ముందుగా చైర్మన్ అభ్యర్థులను ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో ధీటైన ప్రత్యామ్నాయం బీజేపీనేనని అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌ గ్రాఫ్ పడిపోతుందని, కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమని వ్యాఖ్యానించారు.

చదవండి: ఈ ఫలితాలు కేసీఆర్‌ సర్కారుకు చెంపపెట్టు: ఎంపీ

నిజామాబాద్‌ : మున్సిపాలిటీలన్నీ ఆ పార్టీవే

రసవత్తరం.. అక్కడ కమలం, కారు ఢీ..!

ఇది ఆలిండియా రికార్డు : కేసీఆర్‌

మరిన్ని వార్తలు