ఇక తాండూరుకు ‘ఎల్‌ఈడీ’ కాంతులు!

26 Aug, 2014 23:55 IST|Sakshi

 తాండూరు: తాండూరు మున్సిపాలిటీ ఇక ధగధగ మెరిసి పోనున్నది. ఎల్‌ఈడీ విద్యుత్ దీపాల వెలుతురుతో మున్సిపాలిటీ ప్రధాన వీధులు మరింత ప్రకాశించనున్నాయి. ఈ కొత్త ఎల్‌ఈడీ  వీధిదీపాల ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ప్రాజెక్టుగా జిల్లాలో తాండూరు మున్సిపాలిటీని ఎంపిక చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ను పొదుపు చేయడంతోపాటు వీధిదీపాల వినియోగంలో లక్షల రూపాయల వ్యయాన్ని తగ్గించాలనే ఆలోచనతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్‌లతోపాటు ఏడు మున్సిపాలిటీలు  ఈ ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటుకు  ఎంపికయ్యాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో తాండూరు మున్సిపాలిటీ నుంచి సుమారు 300 ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో భాగంగా మొదట సుమారు 200 దీపాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన మార్గాల్లో 250 వాట్స్ కలిగిన సోడియం వేపర్(ఎస్‌వీ) దీపాలు ఉన్నాయి.

 వీటి వల్ల విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. నెలకు రూ.9 లక్షలు వ్యయం అవుతుంది. ఈనేపథ్యంలో ఎస్‌వీ దీపాల స్థానంలో కొత్తగా 90 వాట్స్ కలిగిన ఎల్‌ఈడీ దీపాలను సర్కారు ఏర్పాటు చేయనున్నది. ఎస్‌వీ దీపాలకంటే రెట్టింపు వెలుతురు ఉండటంతోపాటు విద్యుత్‌పొదుపు అవుతుంది. ఖర్చు కూడా తగ్గుతుంది. త్వరలోనే ఈ ఎల్‌ఈడీ దీపాల ఏర్పాటుతో మున్సిపాలిటీకి కొత్త శోభరానుంది.

మరిన్ని వార్తలు