బీజేపీని బలోపేతం చేద్దాం

14 Aug, 2015 00:32 IST|Sakshi

 మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ: రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసి, అధికారం దిశగా ముందుకెళ్లాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. గురువారం మహబూబ్‌నగర్ పట్టణంలోని గాయత్రి పంక్షన్ హాలులో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రణాళికలతో ముందుకెళ్లాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకుండా హామీలకే పరిమితమయ్యారని ఆరోపించారు.
 
 విద్య, ఉద్యోగ , రైతు, పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. రానున్న రోజుల్లో రోజుల్లో టీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమని ఆయన అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో ముందుండాలని, అందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజలకు వివరించి, అవి వారి దరికి చేరేలా కృషి చేయాలని కిషన్‌రెడ్డి నాయకులకు విజ్ఞప్తి చేశారు. అంతకుముందు నియోజకవర్గాల వారీగా పార్టీ ఇన్‌చార్జిలతో పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గానికి చెందిన నాయకులు ఇన్‌చార్జి లేక నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
 
  పార్టీ ఇచ్చే కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలల్లో తాము ముందుకెళ్లలేకపోతున్నామని, వెంటనే నియోజకవర్గానికి ఇన్‌చార్జి నియమించాలని వారు కోరారు. దీనికి కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగూరావు నామాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆచారి, ప్రేమేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి శాంతికుమార్, మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి, రాష్ట్ర నాయకులు నింగిరెడ్డి, కొండయ్య, వెంకట్‌రెడ్డి, జిల్లా నాయకులు బాలరాజు, శ్రీవర్ధన్‌రెడ్డి, కృష్ణ, నాయక్, ప్రభాకర్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, బురుజు రాజేందర్‌రెడ్డి, రామచంద్రయ్య, ప్రభాకర్ వర్ధన్, శ్రీనివాసగౌడ్, శ్రీనివాసరెడ్డి, పడాకుల సత్యం, బుడ్డన్న తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు