లాక్‌డౌన్‌ : మద్యం బ్లాక్‌ దందా..

31 Mar, 2020 12:25 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: లాక్‌డౌన్‌ పీరియడ్‌లో మద్యం వ్యాపారుల దోపిడీకి అంతులేకుండా పోయింది. మద్యం ప్రియుల బలహీనతను సొమ్ముగా మార్చుకుంటున్నారు. వైన్స్‌ షాపులు, బార్లలోని మొత్తం స్టాక్‌ను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించారు. ఎమ్మారీ్పకి నాలుగింతల రేట్లకు మద్యం బాటిళ్లను అమ్ముతున్నారు. మద్యం తాగటం బలహీనతగా మారిన కొందరు గత్యంతరం లేని స్థితిలో కొనుగోలు చేస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. వారం రోజులుగా ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు గుట్టుచప్పుడు సాగుతున్నాయి. ప్రధానంగా నిజామాబాద్‌ నగరంలో మద్యం వ్యాపారుల ఇష్టారాజ్యం మారింది. ఇప్పుడిది  అంతటా హాట్‌ టాపిక్‌గా మారింది. 

అడ్డుకోవాల్సిన వారే అండగా..
మద్యం బ్లాక్‌ మార్కెట్‌లో అమ్ముడవుతుంటే మరోవైపు ఎక్సైజ్‌శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. మద్యం అక్రమంగా విక్రయిస్తే పట్టుకొని కేసులు నమోదు చేయాల్సిన వారే అక్కమార్కులకు అండగా ఉంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విజృంభిస్తున్న కల్తీకల్లు.... 
మరో వైపు కల్తీకల్లు విజృంభిస్తోంది. నగరంలో, జిల్లాలో కల్లు డిపోలు , కల్లు దుకాణాలు ఎక్కడికక్కడ మూతపడిన విషయం తెలిసిందే. అయితే కల్లు విషయంలో సైతం రూ.10 నుండి 20 లోపు ఉండే సీసా ధర ఇప్పుడు ఏకంగా రూ.50 పైనే విక్రయాలు జరుపుతున్నారు.

మా దృష్టికి వస్తే లైసెన్స్‌ రద్దు చేస్తాం 
జిల్లాలో , నిజామాబాద్‌ నగరంలో ఎక్కడైన సరే అక్రమంగా మద్యం అమ్మకాలు జరుపడం నేరం. దీనిపైన ఎవరైన మాకు కచ్చితమైన సమాచారంతో ఫిర్యాదు చేస్తే సంబంధిత మద్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని లైసెన్స్‌ను రద్దుచేయడం చేస్తాం. ఈ విషయంపై మూడు టీమ్‌లు సిద్ధం చేస్తున్నాం. ఎవరు కూడా అక్రమంగా మద్యం , కల్తీకల్లు విక్రయించవద్దు.  – డాక్టర్‌ నవీన్‌చంద్ర,  ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ 

మరిన్ని వార్తలు