రాజధానిలో లిక్కర్‌ చాక్లెట్లు

15 Jul, 2018 02:26 IST|Sakshi

     అక్రమంగా విక్రయిస్తుండగా పట్టుకున్న ఎక్సైజ్‌ అధికారులు 

     ఇంట్లోనే తయారుచేస్తూ పట్టుబడ్డ మరోవ్యక్తి 

సాక్షి, హైదరాబాద్‌: మద్యం తాగడం గురించి తెలుసు.. కానీ మద్యం తినొచ్చని మీకు తెలుసా..? అవును గ్లాసులో పోసుకుని సోడా కలుపుకొని తాగడం మనకు తెలిసిన విధానం కానీ బ్రాందీ, విస్కీ, రమ్ముతో తయారు చేసిన లిక్కర్‌ చాక్లెట్ల అమ్మకాలు మన హైదరాబాద్‌లోనే జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి చాక్లెట్లపై మన దేశంలో నిషేధం ఉన్నా అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ మాఫియా లిక్కర్‌ చాక్లెట్లను డెన్మార్క్‌ నుంచి అక్రమంగా తెప్పించి మెట్రోపాలిటన్‌ నగరాల్లో విక్రయిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ చాక్లెట్‌ డిస్ట్రిబ్యూటర్‌ ముఠాతో ఒప్పందం చేసుకొని విక్రయిస్తుండగా హైదరాబాద్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు పట్టుకున్నారు.

లండన్, ఐరిస్, డెన్మార్క్‌కు చెందిన మొత్తం 96 బాక్సుల్లో ఉన్న 1,081 చాక్లెట్లను అధికారి నంద్యాల అంజిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్‌లో 4 శాతం ఆల్కహాల్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, గతంలో ఇలాగే లిక్క ర్‌ చాక్లెట్లను సరఫరా చేసిన అబిడ్స్‌కు చెందిన శ్రీధర్‌ అనే వ్యక్తి ప్రస్తుతం ఇంట్లోనే లిక్కర్‌ చాక్లెట్ల కంపెనీ పెట్టాడు. స్థానికంగా లభించే విస్కీ, బ్రాందీ, రమ్ము తీసుకొచ్చి వాటితో చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తుండగా హైదరాబాద్‌ ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌ వివేకానందరెడ్డికి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 1.3 కిలోల విస్కీ చాక్లెట్లు, 1.5 కిలోల రమ్ము చాక్లెట్లు, 6.4 కిలోల చాక్లెట్‌ పదార్థాలు, లిక్కర్‌ సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు