తొలిరోజే 233 దరఖాస్తులు

10 Oct, 2019 05:25 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం దుకాణాల నిర్వహణకుగాను నోటిఫికేషన్‌ విడుదలైన తొలిరోజే స్పందన లభించింది. దసరా పండుగ మరుసటి రోజే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 233 దరఖాస్తులు వచ్చా యి. పండుగ ప్రభావం ఉన్నా ఆశావహులు అప్పుడే స్పందించడంతో ఈసారి దరఖాస్తులు వెల్లువలా వస్తాయని ఎక్సైజ్‌ అధికారులు భావిస్తున్నారు. తొలి రోజు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను రాష్ట్ర ఎక్సైజ్‌ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్వయంగా పరిశీలించారు. నాంపల్లిలోని ఆబ్కారీ భవన్‌లో బుధవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రిటైల్‌ వైన్‌ షాప్‌ల అప్లికేషన్లను స్వీకరించే ఏర్పాట్లపై చర్చించారు.

రిటైల్‌ షాప్‌ల ఏర్పాటుకు నోటిఫికేషన్‌ విడుదల అయిన నేపథ్యంలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు దరఖాస్తులను స్వీకరించే విధానంపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాల్లో 34 రిటైల్‌ అప్లికేషన్ల సెంటర్లలో చేసిన ఏర్పాట్లు, మౌలిక వసతులపై డిప్యూటీ కమిషనర్లతో ఫోన్లో మాట్లాడారు. ఆబ్కారీ భవన్‌లో ఉన్న కమాండ్‌ కంట్రోల్‌ను మంత్రి పరిశీలించారు. సమీక్షలో హైదరాబాద్‌ డిప్యూటీ కమిషనర్‌ వివేకానందరెడ్డి, శీలం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు